పదేళ్లలో ఏంచేశారో చెప్పండి?
హన్మకొండ చౌరస్తా: అధికారంలో ఉన్న పదేళ్లలో ఏంచేశారో ఒక్కటి చెప్పాలని, రెండేళ్లలో తాను చేసిన పనులు చెబుతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ఉనికిని చాటుకోవడానికి బావబామ్మర్దులు దిగజారి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అధికారం పోయినా కేటీఆర్లో అహంకారం తగ్గలేదని, స్థాయిని మించి సీఎంను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. వరంగల్లోని సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని బయటి నుంచి కాదని లోపలికి వెళ్లి పరిశీలించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి నిర్మాణంలో దోచుకుతిన్న సొమ్మును త్వరలోనే కక్కిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలకు డెడ్లైన్ విధించామని చెప్పారు. ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కలు చేసి నాశనం చేసినప్పుడు జిల్లా బీఆర్ఎస్ నాయకులు నోరు మూసుకున్నారని, పదేళ్లలో నిధుల కోసం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఏనాడైనా కేసీఆర్ను కలిసే ధైర్యం చేశారా అని ప్రశ్నించారు.
బ్లేడ్బ్యాచ్కు గౌరవ అధ్యక్షుడే కేసీఆర్..
మాజీ సీఎం కేసీఆర్ బ్లేడ్బ్యాచ్కు గౌరవ అధ్యక్షుడని, హరీశ్రావు, కేటీఆర్, వినయ్భాస్కర్ సభ్యులని విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. నాలుగో డివిజన్లోని యాదవనగర్లో యువకుడిపై కత్తితో దాడి చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ అశోక్ను పరీక్షించగా 86 శాతం ఆల్కహాల్ తీసుకున్నట్లు తెలిసిందన్నారు. మేధావులు ఓటుకు దూరంగా ఉండడంతోనే ఇలాంటి రౌడీలు, గూండాలు ప్రజాప్రతినిధులు అవుతున్నారని అన్నారు. కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, కొండా నాగరాజు, నలుబోలు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు
ముక్కలు చేసినా నోరు మెదపలే..
బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఫైర్


