విన్నపాలు వినవలె..
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కిటకిటలాడింది. వివిధ సమస్యలపై అధిక సంఖ్యలో వినతులు అందించారు. అనేక రకాల సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఫిర్యాదులు స్వీకరించి ఆయా విభాగాలకు సిఫార్సు చేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. వ్యక్తిగత సమస్యల నుంచి కనీస సదుపాయాలు కల్పించాలనే ఇక్కట్లు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ గ్రీవెన్ సెల్లోని వివిధ సమస్యలపై సమీక్షించి, అధికారులకు సిబ్బందికి సూచించారు. మొత్తం 114 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ సెక్షన్కు 54, ఇంజనీరింగ్ విభాగానికి 32, రెవెన్యూ సెక్షన్కు 8, హెల్త్ – శానిటేషన్ 12, తాగునీటి సరఫరా 7, విపత్తు నిర్వహణ 1 అందినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, టీఓ రామకృష్ణ, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● 32వ డివిజన్ పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, స్వచ్ఛ ఆటోలు చెత్త సేకరించడం లేదని, డివిజన్ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని కార్పొరేటర్ పల్లం పద్మరవి కోరారు.
● రామన్నపేటలో 12–8–171 ఇంటి డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని సత్యనారాయణ ఫిర్యాదు అందించారు.
● గొర్రెకుంటలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ల్యాదల్ల సుప్రియ విన్నవించారు.
● దేశాయిపేట అంబేడ్కర్ వీధిని విస్తరించి, సెంట్రల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
● హనుమకొండలోని చాకలి ఐలమ్మ కమ్యూనిటీ హాల్, విద్యా భవన్ నిర్మాణానికి అదనంగా నిధులు కేటాయించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి లేఖను కమిషనర్కు సంఘం నాయకులు అందించారు.
● నల్లా కనెక్షన్కు దరఖాస్తు చేసి 20 రోజులు గడిచినా మంజూరు చేయడం లేదని తిమ్మాపురానికి చెందిన బీరం లత ఫిర్యాదు చేశారు.
● 57వ డివిజన్ పలు అభివృద్ధి పనులకు టెండర్లు జరిగాయని, పనులు మొదలు పెట్టడం లేదని కార్పొరేటర్ నల్లా స్వరూప రాణి రెడ్డి వినతి పత్రం సమర్పించారు.
● 2వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో నల్లా కనెక్షన్లు మంజూరు చేయాలని, డ్రెయినేజీలు నిర్మించా లని పలుమార్లు దరఖాస్తు చేసినా స్పందించడం లేదని సీపీఎం నాయకులు వినతి అందించారు.
● హనుమకొండ 10వ డివిజన్ కాపువాడలో డ్రెయినేజీ పూడిక తీయించాలని, రోడ్లు, డ్రెయినేజీ పునర్నిర్మించాలని కాలనీవాసులు కోరారు.
● 53వ డివిజన్లో 8 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిందని, 5 సార్లు దరఖాస్తు అందించినా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.
● కాజీపేటలో శాశ్వత భవనం నిర్మించి గ్రంథాలయాన్ని నిర్మించాలని కె.ప్రకాశ్ విజ్ఞప్తి చేశారు.
● 2వ డివిజన్ వంగపహాడ్ ఎస్సీ కాలనీలో నిలిచిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, పైప్ లైన్లు వేయాలని ఎ.సుమన్ ఫిర్యాదు అందించారు.
● భవానీనగర్, ఎన్జీఓస్ కాలనీలో జంక్షన్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు విన్నవించారు.
కిటకిటలాడిన గ్రేటర్ వరంగల్ కార్యాలయం
గ్రీవెన్స్కు 114 వినతులు
తక్షణమే అర్జీలకు
పరిష్కారం చూపండి
కమిషనర్ చాహత్ బాజ్పాయ్


