రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, వారి ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్– తెలంగాణ (ఎస్జీపీఏటీ) రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షుడు జి.వీరస్వామి, ప్రధాన కార్యదర్శి వి.రామ మనోహర్ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్–తెలంగాణ హనుమకొండ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల బాధ్యులు ఆకుల రాజేందర్, పుల్లూరు వేణుగోపాల్, కే.శ్రీనివాస్, శ్రీరామ్, సత్యనారాయణ, టి.కుమార్ సంఘీభావం తెలిపారు.


