
ప్రయత్నాలు వినూత్నం.. ఫలితాలు శూన్యం
వినతుల పరిష్కారానికి చర్యలు
న్యూశాయంపేట: ప్రజావాణిలో గత రెండు, మూడు వారాలుగా ఉన్నతాధికారులు వినూత్న ఆలోచనతో ఫిర్యాదుదారుల సమస్యల్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వారం అధికారులు కలెక్టర్ వెనకాల కూర్చోగా.. ఎదురుగా ఎదురుగా ఫిర్యాదు దారులు కూర్చున్నారు. సమస్యల్ని అధికారులకు వివరించారు. ఈవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ముందుగా అర్జీదారులందరితో మాట్లాడించారు. సమస్యలను అక్కడున్న సంబంధిత అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల ఆలోచనలు బాగున్నప్పటికీ.. కింది స్థాయి అధికారులు ప్రజల వినతులను పరిష్కరించేందుకు శ్రద్ధ చూపడం లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఆలోచనలు సరే ఆచరణేది? అంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
వినతులు సత్వరమే పరిష్కరించండి
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల్ని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో 136 ఫిర్యాదులు రాగా.. అధికంగా రెవెన్యూ సమస్యలు 60, జీడబ్ల్యూఎంసీ 21, విద్యాశాఖ 11, సహకార శాఖ 9, గృహ నిర్మాణ శాఖ 7, వైద్య ఆరోగ్యశాఖ, ఉపాధికల్పన శాఖలకు 3 చొప్పున, ఇతర శాఖలకు సంబంధించి 22 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ‘వరంగల్ జిల్లా మీదుగా వెళ్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ఆలైన్మెంట్ మార్చాలని పోరాడాం. పరిష్కారం కాలేదు’ అని బాధిత రైతులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఏఓ అనురాధ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, గృహనిర్మాణ శాఖ పీడీ గణపతి, డీసీఓ రాజమణి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, ఆర్సీఓ అపర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.
అనాలోచిత ఏర్పాట్లు.. దివ్యాంగులకు ఇక్కట్లు
అధికారుల అనాలోచిత చర్యతో సోమవారం ప్రజావాణికి వచ్చిన దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. కలెక్టరేట్ సమావేశ హాల్ వెనుక డోర్ వద్ద దరఖాస్తులు స్వీకరించి వరుస క్రమంలో ఫిర్యాదులను స్కాన్ చేసి ఫిర్యాదుదారులను వరుస క్రమంలో పంపేవారు. కానీ సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సమావేశ హాల్లోకి వచ్చే దారిలో ర్యాంపు ఎదురుగానే కంప్యూటర్ పెట్టుకుని సిబ్బంది కూర్చున్నారు. దీంతో ర్యాంపు మీదుగా రాలేక దివ్యాంగులు మెట్లు, ఎక్కుతూ, దిగుతూ ఇబ్బందులు పడి కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు.
ఫిర్యాదుదారులతో మాట్లాడించిన కలెక్టర్
ఆతర్వాత అర్జీల స్వీకరణ
సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అర్జీదారుల మొర
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలనుంచి స్వీకరించిన వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని సూచించారు. ప్రజావాణిలో హౌసింగ్ పీడీ–20, తహసీల్దార్ హసన్పర్తి–15, ఆర్డీఓ హనుమకొండ–14, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ –13లతో పాటు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 150 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేష్, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేష్, నారాయణ, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ప్రయత్నాలు వినూత్నం.. ఫలితాలు శూన్యం