
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు
మేయర్ సుధారాణి
న్యూశాయంపేట: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ద్వారా రూపొందించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు బల్దియా ద్వారా వంద రోజుల పాటు చేపట్టే కార్యాక్రమాల గురించి వివరించారు. ఈవంద రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటడం, ముంపు నివారణకు 36 ప్రధాన నాలాల్లో రూ.1.21 కోట్లతో పూడికతీత పనులు పూర్తి చేయడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నగరంలోని గోడలపై మృనాల్ పెయింటింగ్లు వేయడం, వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాల్లో ఉన్న బ్లాకేజ్ ప్రాంతాలను గుర్తించి మెష్లు ఏర్పాట్లు చేయాలని, జంక్షన్లలో సుందరీకరణ పనులు, రెండు పార్కుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, శిథిలావస్థ నిర్మాణాల తొలగింపు, అంతర్గత మురుగు కాల్వల పరిశుభ్రత, తదితర పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వంద రోజుల ప్రణాళిక విజయవంతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.