
వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం చేసిందేమిటి..?
హన్మకొండ: రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆదివారం హనుమకొండ రాంనగర్లోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని సాగు నీటిని విడుదల చేయలేక పోయారని విమర్శించారు. సమ్మక్క–సారలమ్మ రిజర్వాయర్ నుంచి 24టీఎంసీల నీరు ఎత్తిపోసుకునే అవకాశమున్నా గతేడాది లిఫ్ట్ చేయక నీరంతా వృథాగా పోయిందన్నారు. ఈ ఏడాది కూడా ఎత్తిపోయలేదని, దేవాదుల మూడో దశ ట్రయల్ రన్ దశలోనే ఫెయిలైందని తూర్పారబట్టారు. సాగు నీరు లేక సగం పంటల ఎండిపోతే అధిక పంట ఉత్పత్తి వచ్చిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ద్వారా రిజర్వాయర్ల కెపాసిటీ పెంచారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 234 టీఎంసీల నీరు ఎల్లంపల్లి నుంచి దిగువకు పోయిందన్నారు. రాజకీయాల్లో ఉన్న వారు ప్రజల అవసరాలు, అభివృద్ధి ప్రాథమిక బాధ్యతగా భావించాలని హితవు పలికారు. మేడిగడ్డలో మూడు బరాజ్లు పునర్మించడానికి రూ.400 కోట్లు ఖర్చవుతాయని, ఈ పనులు చేపట్టకుండా మొత్తం ప్రాజెక్టును వృథాగా పడేశారన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్
నాయకుడు పొన్నాల లక్ష్మయ్య