 
															దూరవిద్య యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ సంవత్సరం జూలై, ఆగస్టు మాసాలలో జరిగిన పలు యూజీ, పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు గురువారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ తృతీయ సెమిస్టర్, ఎంబీఏ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. నవంబర్ 12వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు ప్రతి పేపర్కు రూ.770 చొప్పున, పీజీ కోర్సులకు రూ.960 వంతున ఫీజు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల విభాగం కోఆర్డినేటర్ ఆచార్య డి. రామచంద్రన్, డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పి.కృష్ణవేణి, డి.కోదండపాణి, సూపరింటెండెంట్ టి. వెంకటేశ్వర్లు, జవ్వాజి శ్రీనివాసరావు, మాధురి, దూర విద్య ఐసీటీ డివిజన్ డైరెక్టర్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
రేపల్లె: మోంథా తుఫాన్ను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా ఇబ్బంది లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారన్నారు. రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఆర్డీవో నేలపు రామలక్ష్మి, డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, కమిషనర్ సాంబశివరావు, ఏడీఏ లక్ష్మి, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ పృథ్వీ గణేష్ పాల్గొన్నారు.
వేటపాలెం: మండల పరిధిలోని రామాపురం నుంచి కఠారివారిపాలెం గ్రామాల మధ్య సముద్రం తీరం వెంట ఉన్న నేల చప్టా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో తీరం వెంట రోడ్డుపై రాకపోకలు నిలిచి పోయాయి. ఓడరేవు నుంచి రామాపురం, కఠారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామాల వరకు తారు రోడ్డు ఉంది. ఈ రోడ్డుకు తూర్పు వైపు సముద్రం, పశ్చిమం వైపున రిసార్టులున్నాయి. ఈ రోడ్డు మార్గంలోనే నిత్యం పర్యాటకులు, టెలీ ఫిలిమ్స్, షార్టు ఫిల్మ్లు తీసే వారు, చిత్ర పరిశ్రమలకు చెందిన వారు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు నేల చప్టా కొట్టుకొనిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గం ద్వారా వాహనాలు ప్రయాణించకుండా రెండు వైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
నరసరావుపేట ఈస్ట్: సత్తెనపల్లిరోడ్డులోని పులుపుల వారి వీధినందు శ్రీవీరాంజనేయ సహిత శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి చిలకల గురవయ్య బాబు వెంకటలక్ష్మి దంపతులు, చిలకల గురవయ్య, వెంకట పద్మావతి దంపతులు రూ.6,00,116 విరాళంగా అందించారు. పిన్నంశెట్టి వెంకట సుధాకర్, ఝాన్సీలక్ష్మి దంపతులు రూ.51,116 విరాళంగా అందించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు వనమా సాంబశివరావు, వనమా కృష్ణ పాల్గొన్నారు.
 
							దూరవిద్య యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల
 
							దూరవిద్య యూజీ, పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
