
మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు పురస్కారాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకులను సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబర్లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన ఆర్. రిషబ్ ఓస్వాల్, జూన్–2024లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకున్న కొత్తపేట తేజస్వినిని ఈనెల 23న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి సత్కరించారని వివరించారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు 55 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారని, అయితే గతేడాది జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులను కై వసం చేసుకోవడం అరుదైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి మోహన్ అభినందనలు తెలియజేశారు.
న్యాయవాదుల విశిష్టతకు పుస్తక రూపం అభినందనీయం
తెనాలి: న్యాయవాదుల విశిష్టతను నేటి తరానికి తెలియజేయడం అభినందనీయమని పలువురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయి ఆవిష్కరించిన ‘తెనాలి లాయర్స్ డైరీ–2025’ పరిచయ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం తెనాలి కోర్టు ప్రాంగణంలోని మహిళా న్యాయవాదుల భవనంలో నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. 11వ అదనపు జిల్లా జడ్జి డి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.పవన్కుమార్, ఫస్ట్ ఏఎంఎం వివేక్వర్ధన్లు పాల్గొన్నారు. తెనాలి లాయర్స్ డైరీతో ఈ ప్రాంత న్యాయవాదుల ప్రాముఖ్యతను, సమాచారాన్ని పొందుపరచడం ఉపయోగకరమని జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మందలపు వేణుగోపాల్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, నాయయవాదులు వెలినేని రాఘవయ్య, మద్ది మల్లికార్జునరావు, ఎం.జగదీశ్వరాంబ, ఎ.విజయలక్ష్మి, గుమ్మడి రవిరాజ్ మాట్లాడారు. తెనాలి లాయర్స్ డైరీ రూపకల్పన చేసిన గుంటూరు కృష్ణను సత్కరించారు.

మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు పురస్కారాలు