
అవగాహనతోనే మాతృ మరణాలకు అడ్డుకట్ట
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి
గుంటూరు మెడికల్: గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడంతో మాతృ మరణాలు నివారించవచ్చని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం సబ్ డిస్ట్రిక్ట్ స్థాయి మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మే నెలలో గుంటూరువారితోట పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన మాతృ మరణానికి గల కారణాలను కమిటీ సభ్యులు సమీక్షించారు. కూలంకషంగా చర్చించాక ఈ మరణం నివారించలేనిదిగా నిర్ణయించినట్లు డాక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి మరణాలు సంభవించకుండా ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు, వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మాతృ మరణాలకు గల కారణాలపై గర్భిణులు, బాలింతలతోపాటు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. గర్భిణులు కూడా క్రమం తప్పకుండా వైద్యాధికారి వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం, వ్యాయామం, తగిన విశ్రాంతి తీసుకోవడం లాంటి చర్యలతో మాతృ మరణాలను పూర్తిగా నివారించవచ్చని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్ రంగారావు, డాక్టర్ ఝాన్సీవాణి, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ ఆదిత్య ప్రదీప్ రెడ్డి, డాక్టర్ రాధికా రాయుడు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ ప్రియాంక, శ్రీధర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.

అవగాహనతోనే మాతృ మరణాలకు అడ్డుకట్ట