
పాలకుల తీరుపై ఉపాధ్యాయుల కన్నెర్ర
● బదిలీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం ● ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ బదులు మాన్యువల్గా చేయాలని డిమాండ్ ● గుంటూరు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం ముట్టడి ● ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
గుంటూరు ఎడ్యుకేషన్: తమ న్యాయమైన డిమాండ్లకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)ల బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ విధానంలో నిర్వహించేందుకు మొండి వైఖరి ప్రదర్శిస్తున్న ప్రభుత్వ తీరుపై నిరసనగళం వినిపించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వెబ్ వద్దు... మాన్యువల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను అడ్డుగా పెట్టిన ఉపాధ్యాయులను నిలువరించే ప్రయత్నం చేశారు.
మాట తప్పిన కూటమి ప్రభుత్వం
ఈ సందర్భంగా ముట్టడికి నేతృత్వం వహించిన ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ... ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన సమయంలో ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. ప్రస్తుతం ఎంఈవోల ద్వారా సమాచారాన్ని పంపి, బలవంతంగా వెబ్ కౌన్సెలింగ్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెబ్ విధానంలో ఒక్కో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు 3 వేలకుపైగా ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉండటం వల్ల మానసిక ఆందోళనకు గురి అవుతారన్నారు. వెబ్ ఆప్షన్లలో వేల సంఖ్యలో పాఠశాలలను ఎంపిక చేసుకోవడం కష్టసాధ్యం కావడంతోనే మాన్యువల్లో నిర్వహించేదుకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు హడావుడిగా వెబ్ కౌన్సెలింగ్కు ఏర్పాట్లు చేశారని మండిపడ్డారు.
ఉపాధ్యాయులను మోసగించారు
ఐక్యవేదిక నాయకులు యు. రాజశేఖర్రావు, ఎం. కళాధర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయులను మోసగించిన ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఈ ఆందోళన జరిగిందన్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్కు వ్యతిరేకతను స్పష్టంగా చాటారని అన్నారు. ఒక పక్క మంచి ప్రభుత్వమని చెప్పుకొంటూ, మరోవైపు ఉపాధ్యాయులను మోసగించడం సరైన విధానం కాదన్నారు. తక్షణం విద్యాశాఖ మంత్రి లోకేష్ జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డి.పెదబాబు, ఎస్.రామచంద్రయ్య మాట్లాడుతూ తక్కువ సంఖ్యలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్లో అనేక తప్పులు జరిగాయని తెలిపారు. సీనియార్టీ జాబితాల్లో తప్పులు రావడమే కాకుండా 50 ఆప్షన్లు నమోదు చేసుకునేందుకే రెండు గంటలకుపైగా సమయం పట్టిందన్నారు. ఇక రెండు వేల నుంచి మూడు వేల సంఖ్యలో ఆప్షన్లు నమోదుకు గంటల కొద్దీ సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆర్థిక భారం లేని బదిలీలను ఉపాధ్యాయులు కోరుకున్నట్లు చెప్పారు. ఇలా నిరంకుశంగా వ్యవహరించడం వలన ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. అధికారుల మాటలు విని వేలాది మంది ఉపాధ్యాయుల మనోభావాలతో ఆడుకోవడం ప్రభుత్వానికి తగదన్నారు.

పాలకుల తీరుపై ఉపాధ్యాయుల కన్నెర్ర