
పిల్లలను సురక్షితంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే
గుంటూరు లీగల్: పిల్లలను సురక్షితంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదేనని, సమాజంలో పౌరులుగా మనందరి బాధ్యత కూడా అని న్యాయ సేవా సదన్ సెక్రెటరీ సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. పిల్లలు జాగ్రత్తగా ఉండేందుకు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలు చేశారు. క్యాలెండరు యాక్టివిటీస్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శనివారం అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సుకు జియావుద్దీన్ అధ్యక్షత వహించి, మాట్లాడారు. పిల్లలు తప్పిపోవడం అనేది తల్లిదండ్రులు, సమాజానికి పెద్ద సవాలుగా మారిందన్నారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పిల్లలు కనిపించకుండా పోతున్నారని, వారిలో కొంతమంది తిరిగి వచ్చినా చాలా మంది జాడ తెలియయరాలేదని తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం మూడు సంవత్సరాలలో 10వేలకుపైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. 2022లో 83,350 మంది చిన్నారులలో 62,946 మంది బాలికలు ఉన్నారని, ప్రతి నలుగురు పిల్లలలో ముగ్గురు బాలికలున్నారని వెల్లడించారు. ప్యానల్ అడ్వకేట్ కె.కాళిదాసు మాట్లాడుతూ ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసిజర్ పోలీస్ యూనిట్ ఎలా పనిచేస్తుంది, పిల్లలు తప్పిపోతే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేయాలి, పిల్లలు ట్రేస్ కాకపోతే ఆ కేసును సీఐడీకి ఎలా బదిలీ చేయాలో వివరించారు. జిల్లా పంచాయత్ ఆఫీసర్ సాయికుమార్, డీపీఓ, శిశు సంక్షేమ శాఖ విజయ్కుమార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హనుమాన్ సాయి మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను కాలయాపన లేకుండా ఎలా ట్రేస్ చేయగలమో వివరించారు. బాల కార్మికులుగా పనిచేసే పిల్లలను గుర్తించి వారికి రక్షణ కల్పించి, వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దవచ్చునో వివరించారు. కార్యక్రమలో అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ప్యానల్ అడ్వకేట్లు, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు.
న్యాయ సేవా సదన్ సెక్రెటరీ
సయ్యద్ జియావుద్దీన్