
గుంటూరు వెస్ట్: మానవ జీవితంలో ఉండే అనేక కోణాలను ఉగాది పండుగ చక్కగా ఆవిష్కరిస్తుందని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు చింతలపాటి నాగరాజ శర్మ పంచాంగ శ్రవణం, మల్లీస్ డాక్స్ అకాడమీ, అమ్మ డాన్స్ కూచిపూడి కళాకారుల నృత్యాలు, సొంపైన సంగీత వాయిద్యాలతో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ నూతన తెలుగు సంవత్సరంలో వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ, పారిశ్రామిక, రైతులు, యువత, మహిళలు ఇలా అందరికీ మంచి జరగాలని కాంక్షించారు. జీవితంలో ఎదురైన కఠోర సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ప్రజలకు మరింత ఉత్తమ సేవలందించాలన్నారు. కలెక్టర్, జేసీ రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ గంజి చిరంజీవి, కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం, నెడ్క్యాప్ రాష్ట్ర డైరెక్టర్ కొత్త చిన్నపరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్, టిడ్కో డైరెక్టర్ నాగేశ్వరి, మిర్చియార్డు చైర్మన్ మద్దిరెడ్డి సుధాకరరెడ్డిలు వేదపండితులను ఘనంగా సత్కరించారు.
కలెక్టరేట్లో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు నాగరాజశర్మ పంచాంగ శ్రవణం.. అలరించిన సాంప్రదాయ నృత్యరీతులు

పౌష్టికాహార పదార్థాలను పరిశీలిస్తున్న కలెక్టర్, జేసీ