అత్తింటి వేధింపులకు వివాహిత మృతి

- - Sakshi

పెనమలూరు: అత్తింటి వేధింపులకు వివాహిత తనువు చాలించింది. తమ కుమార్తె మరణానికి అత్తింటివారే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఆర్‌.గోంవిదరాజు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌ మేడ్చల్‌ జిల్లా మేడిపల్లికి చెందిన మసనం వేణు ప్రైవేటు లెక్చరర్‌గా పని చేస్తారు. ఆయన కుమార్తె సహజ (26)ను తాడిగడప మున్సిపాలిటీ కానూరు సనత్‌నగర్‌కు చెందిన బిట్రా ఉమాకాంత్‌కు ఇచ్చి 2020లో వివాహం చేశాడు. పెళ్లి సమయంలో కట్నకానుకలు ఇచ్చారు.

వీరికి ఓ కుమార్తె ఉంది. అదనపుకట్నం తీసుకురమ్మని సహజను భర్త ఉమాకాంత్‌తో పాటే అత్త సక్కుబాయ్‌, ఆడపడుచు ఉడతా కిరణ్మయి వేధించసాగారు. ఈ విషయమై సహజ తల్లిదండ్రులు వచ్చి అత్తింటివారికి అనేక సార్లు నచ్చచెప్పారు. అయినా వ్యవహారంలో మార్పురాలేదు. మంగళవారం సహజను భర్త ఉమాకాంత్‌ వేధింపులకు గురి చేశాడు. భర్త తనను ఇబ్బందులు పెడుతున్నాడని సహజ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. ఆ తరువాత సహజ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని మృతి చెందింది.

అత్తింటివారే హతమార్చారు...
కాగా తహసీల్దార్‌ టీవీ సతీష్‌ బుధవారం శవపంచనామా చేయగా మృతురాలి కటుంబ సభ్యులు అత్తింటివారి పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుమార్తె సహజను అత్తింటివారే చంపి ఉరివేశారని ఆరోపించారు. ఈ ఘటనకు భర్త, అత్త, ఆడపడుచే కారణమని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top