చదువుకూ, విద్యకూ తేడా! | Gopala Krishna Kovvali write on Indian education system | Sakshi
Sakshi News home page

పట్టభద్రులు కాదు, విద్యావంతులు కావాలి!

May 26 2025 8:02 PM | Updated on May 26 2025 8:16 PM

Gopala Krishna Kovvali write on Indian education system

వేసవి కాలం ఉక్కపోత, విద్యార్థులకు పరీక్షలు, ఫలితాల కాలం. చదువుకు అధిక ప్రాముఖ్యాన్నిచ్చే సమాజంలో, ముఖ్యంగా మధ్యతరగతి తెలుగు కుటుంబాలలో, చదువుతో వచ్చే పట్టాలకి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులు పిల్లలపై ఉంచే అంచనాల వల్ల పెరిగే ఉక్కపోత వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నది అందరం గమనించే విషయమే. ఏ దేశానికైనా మూల వనరులతో పాటు మానవ వనరులు కూడా చాలా అవసరం. దేశంలో సుమారు 60 వేల ఉన్నత విద్య సంస్థలు ఉన్నాయి. 2023–24 ఆర్థిక సర్వే ప్రకారం, సగం మంది పట్టభద్రులు నైపుణ్యం లేమి కారణంగా ఉద్యోగార్హత లేనివారు. ఈ పట్టభద్రులలో విద్యావంతులు ఎంతమంది?

చదువు, విద్య అన్న పదాలను సమానార్థకంగా వాడుతున్నా, వాటి అంతరార్థం వేరు. కొన్ని విషయాలను నేర్చుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఒక పట్టా పొందే అవకాశం ఇచ్చే ప్రక్రియను ‘చదువు’ అని అంటున్నాం. మరి విద్య అంటే?

చదువుకూ, విద్యకూ తేడా!
‘అజ్ఞానాన్ని తరిమివేసే సత్యాన్వేషణే విద్య’ అంటాడు సోక్రటీస్‌; ‘ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య’ అని నిర్వచించాడు అరిస్టాటిల్‌’; ‘మానవుడి బుద్ధి దేని ద్వారా వికసిస్తుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, శీలం ఏర్పడుతుందో, మానవుడు దేని ద్వారా స్వశక్తితో నిల్చుంటాడో అదే విద్య’ అని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు.

ప్రస్తుత కాలంలో, కొలువుల కోసం కనీస అర్హతనిచ్చే పట్టాలు పొందడమే పరమావధిగా చదువుల ప్రహసనం సాగుతోంది. చదివే సబ్జెక్టుకీ, చేసే ఉద్యోగానికీ పొంతన లేని సందర్భాలు చాలా చూస్తాం. ఏ సబ్జెక్టులో డిగ్రీ పొందినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించడం కోసం యువత పడే పాట్లు ఆధునిక భారత సమాజంలో చూస్తున్నాం. అమెరికాలో ఆర్థిక మాంద్యం అని పుకార్లు వస్తే చాలు అబ్బాయికి వణుకు, అయ్యకి గుండె నొప్పి! ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలమనే ఆత్మ నిబ్బరం కలిగించే ‘విద్యనివ్వని చదువులు’ ఒత్తిడి కారకం అవుతున్నాయన్నమాట!

చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో జ్ఞానం ఇచ్చే చదువులు అరుదు. ప్రస్తుత చదువులు సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాయి. బతుకుతెరువు నేర్పే విద్యలు కళాశాలలో, విశ్వ విద్యాలయాలలో దొరకడం లేదు. ఏ పట్టాలూ లేని రైతు అనుభవంతో పొందిన నైపుణ్యంతో పంట పండిస్తాడు. ఎంతో ఖర్చు పెట్టి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో అత్యున్నత పట్టా పొందిన వారికి పొలం దున్నడం, విత్తనాలు వేయడం పాఠ్యాంశంగా మాత్రమే తెలుసు.

పట్టాల కోసం చదివినా... చదువులు యువతకు కొన్ని బతుకు పాఠాలు నేర్చుకునే సాధనాలుగా ఉండాలి. సొంతంగా, తార్కికంగా ఆలోచించి జీవిత ప్రయాణం కొనసాగించే నేర్పు, మనఃస్థితి అలవర్చుకునేలా విద్యనభ్యసించాలి. అది విద్యాలయాల ద్వారా సాధ్యం కాకపోయినా పుస్తక పఠనం ద్వారా, పెద్దల నుంచీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే, యువతకు మార్గనిర్దేశం చేయగల పెద్దలు సమాజంలో ఉన్నారా? తమ పిల్లలు ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు సంపాదించే గొప్ప డిగ్రీలు పొందాలని ఆశించడం సహజమే కానీ సంపాదనతో పాటు సమాజ హితం కాంక్షించే  నైజం అలవరచుకోవాలని కోరుకోవడం అభిలషణీయం కదా!

ముఖ్యంగా యువత విద్యతో పాటు విచక్షణ నేర్వడం అవసరం. మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోగల వివేకం అలవ ర్చుకోవడమే చదువు అంతిమ లక్ష్యంగా ఉండాలి. పట్టాలు పొంది విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టే  యువతకు ‘వివేక చూడామణి’ ఏది? శ్రీవిష్ణుపురాణం ‘విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్, సైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా’ అని విద్యా శక్తిని ప్రతిపాదిస్తుంది. ఏ విద్య సాయంతో ఒక వ్యక్తి తన జీవనాన్ని సాగిస్తుంటాడో, ఆ విద్యయే అతడికి ఇష్టదైవం వంటిది. ఆ విద్య ఆ వ్యక్తికి పూజనీయమైనది; ఆ విద్య ఆ వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది అని సారాంశం.  

విద్య ప్రయోజనాలు, ఆవశ్యకత గురించి ‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్‌’ అనే భర్తృహరి సుభా షితం సమగ్రంగా చెబుతుంది. భౌతిక సుఖాలు, సౌకర్యాలు చేకూర్చే సాధనంగా విద్యను నిర్వచించినా, ‘విద్య గురువు, విశిష్ట దైవతము’ అని చెబుతాడు. అంటే సన్మార్గంలో నడిచే విధంగా మార్గదర్శనం చేసేది, ఉత్తమ గుణసంపదనిచ్చేది. విద్యకు రూపం లేదు; కానీ మంచి విద్య పొందినవారు తమకు తాము గురువు గానూ, దైవం గానూ మలచుకునే శక్తియుక్తులు సంపాదించి సమాజానికి ఉపయో గపడాలన్నది భర్తృహరి ఉపదేశ సారం.

చ‌ద‌వండి: గూగుల్ నిర్ణ‌యంతో పిల్ల‌ల‌కు చేటు?    

పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ కలగలిపి సర్వశక్తి సంపన్నుడుగా, వివేకం, విచక్షణ గల వ్యక్తిగా ఎదగడానికి తనకు తానే గురువుగానూ, దైవం గానూ పరిణమించాలి. అప్పుడే, యువత వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులను తట్టుకుని స్వయం ప్రతిభతో విరాజిల్లగలదు.

- డాక్ట‌ర్‌ గోపాలకృష్ణ కొవ్వలి
సీనియర్‌ శాస్త్రవేత్త, అమెరికా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement