ఆరోగ్య సారథులు 'చిరుధాన్యాలు' | Nutritive Value Of Cereals and Cereal Products | Sakshi
Sakshi News home page

ఆరోగ్య సారథులు 'చిరుధాన్యాలు'

Mar 23 2026 4:09 PM | Updated on Mar 23 2026 4:58 PM

Nutritive Value Of Cereals and Cereal Products

ప్రస్తుతం బియ్యం, గోధుమలే అధికంగా వాడుతున్నాం గానీ ఒకప్పుడు చిరుధాన్యాలదే రాజ్యం. ఏవో రెండు, మూడు కాదు. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెలు, సామలు, ఊదల వంటి ఆరేడు రకాల చిరుధాన్యాలు తినేవారు. అయితే నలబైల్లో వచ్చిన క్షామం, పెరుగుతున్న జనాభా అవసరాలు తిండి గింజల తీరుతెన్నులను పూర్తిగా మార్చేశాయి. శాస్త్రీయ పరిశోధనలు.. హరిత విప్లవం పుణ్యమాని గోధుమ, వరి దిగుబడి గణనీయంగా పెరిగింది. 

దాంతో మన ఆహారపు అలవాట్లు సమూలంగా మారిపోయాయి. ముఖ్యంగా చిరుధాన్యాల వాడకం బాగా తగ్గిపోయింది. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? పోషకాలు అందుతున్నాయా, లేదా? అనే విచక్షణే లేకుండా పోయింది. మరోవైపు శారీరక శ్రమ కూడా తగ్గిపోయింది. ఫలితంగా జీవనశైలితో ముడిపడిన ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, కేన్సర్లు వంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. వీటితో సంభవించే మరణాలూ ఎక్కువవుతూ వస్తున్నాయి. 

ఇవన్నీ మన ఆహార అలవాట్లను ఒక్కసారి సమీక్షించుకోవాలనీ, చిరుధాన్యాలకు పట్టం కట్టాలనీ నిర్దేశిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఆహారమూ సంపూర్ణంగా ఉండాలి. వాటిల్లో సింహభాగం ధాన్యాలదే. అలాంటి చిరుధాన్యాల వల్ల శరీరానికి అందే పోషకాలు ఏంటో సవివరంగా చూద్దామా..!.

చిరుధాన్యాల్లో పోషకాలు పెద్దమొత్తంలో ఉండటమే కాదు. వీటిల్లోని కొన్ని సంయోజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి వరి, గోధుమ వంటి పెద్ద ధాన్యాలు.. రాగులు, కొర్రలు, సామల వంటి చిన్న ధాన్యాలు రెండింటిలోనూ పిండి పదార్థాలు, మాంస కృత్తులు, కొవ్వు, కేలరీలన్నీ కొద్ది గొప్ప తేడాలతో దాదాపు సమానంగానే ఉంటాయి. 

అయితే ఇవి మెరుగైనవి కావటమే విశేషం. వరి, రాగులు, సామల్లో 7% మాంసకృత్తులుంటే.. గోధుమ, జొన్న, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెల్లో 10-12% వరకు ఉంటాయి. పిండి పదార్థమైతే- వరిలో 77%, గోధుమల్లో 64% వరకు.. చిరుధాన్యాల్లో 60-70% వరకు ఉంటుంది. కొన్ని చిరుధాన్యాల్లో 50-55 శాతమే ఉంటుంది. వీటి నుంచి 330-345 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. 

బియ్యం, గోధుమల్లో 2% కొవ్వు ఉంటుంది. చిరుధాన్యాల్లో ఇది ఎక్కువ. అత్యధికంగా సజ్జలతో 5% వరకు కొవ్వు లభిస్తుంది. జొన్న, కొర్రలు, వరిగెల్లో 3 నుంచి 3.5% ఉంటుంది. ఈ కొవ్వు హాని చేసేది కాదు. మంచి శక్తిని ప్రసాదిస్తుంది. వీటిల్లో విటమిన్‌ ఈ కూడా ఎక్కువే. ఖనిజ లవణాల విషయంలో చిరుధాన్యాలదే పైచేయి. రాగుల్లో పాలతో సమానంగా 344 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి ఇదెంతో మేలు చేస్తుంది. 

బియ్యం, గోధుమల్లో ఐరన్‌ అంతగా ఉండదు. చిరుధాన్యాల్లో ఇది మంచి పాళ్లలో లభిస్తుంది. ముఖ్యంగా సజ్జల్లో 8 మి.గ్రా., సామల్లో 9.3 మి.గ్రా ఐరన్‌ ఉంటుంది. రాగులు, జొన్నల్లో సుమారు 4 మి.గ్రా. ఉంటుంది. రక్తహీనత తగ్గటానికిది ఎంతో అవసరం. జీవక్రియల్లో పాలు పంచుకునే మెగ్నీషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, జింక్‌ వంటివీ వీటిల్లో ఎక్కువే. 

ఇన్సులిన్‌ సరిగా ఉత్పత్తి కావటానికి మెగ్నీషియం.. ఎదుగుదలకు జింక్‌ తోడ్పడుతుంది. అయితే బియ్యం, గోధుమల్లో కన్నా చిరుధాన్యాల్లో థయమిన్‌ తక్కువగా ఉంటుంది. నైసిస్‌, పెరిడాక్సిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వంటివి మాత్రం బాగానే ఉంటాయి. కొన్నింటిలో విటమిన్‌ ఏ, బీటా కెరటిన్లు కూడా ఉంటాయి.

(చదవండి: బ్యాంకు ఉద్యోగం, 4BHK ఇంటిని వద్దనుకున్నాడు! కట్‌చేస్తే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement