“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.
సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.
అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.
ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.
ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే..
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు.
కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.
అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి.
మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు.
అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు.
అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
(చదవండి:


