ఈశాన్యంలో విరిసిన జాస్మిన్‌

Aerial medicine service - Sakshi

ఆకాశ మార్గాన ఔషధ సేవ...

రోడ్లు బాగుండవువాతావరణం సరిగా ఉండదు.అదీ గాక గంటల కొద్దీప్రయాణించే సమయం ఉండదు.అలాంటప్పుడు ప్రాణం పోసేమందులు అందాలంటే? డ్రోన్లే దారి.అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిననిక్‌ జాస్మిన్‌ మొత్తం ఈశాన్య రాష్ట్రాలకేమొదటి మహిళా డ్రోన్‌ ఆపరేటర్‌.గాల్లో మందులు పంపే ఈ సవాలునుఆమె సమర్థంగా స్వీకరించింది.

ఈ సన్నివేశం ఎప్పుడూ జరిగేదే. రోడ్డు కూడా సరిగా లేని అటవీ ప్రాంతాల్లో విషజ్వరాలు పాకుతాయి. రోగి కదల్లేడు. అంబులెన్స్‌ రావడానికి సమయం పడుతుంది లేదా రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యి దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లాలన్నా గంటలు గంటలు పడుతుంది. లేదా ఏదో వాగు పొంగి రోడ్డు బ్లాక్‌ అవుతుంది. కొండ చరియలో, చెట్ల కొమ్మలో విరిగి పడతాయి.

సరైన మందు పడితే రోగి ప్రాణాలు దక్కుతాయి. అప్పుడు ఏం చేయాలి?డ్రోన్ల ద్వారా మందులు చేరవేయడం సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనకు వచ్చాయి. ఇందుకు అనేక స్టార్టప్‌ కంపెనీలు, డ్రోన్ల తయారీ సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. సేవారంగంలో ఉన్న సంస్థలు కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతున్నాయి. దాంతో డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ రెండేళ్ల క్రితం నుంచి ఉత్సాహంగా జరుగుతోంది. తెలంగాణలోని వికారాబాద్‌లో ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’ కార్యక్రమం మొదలెట్టడం అందరికీ గుర్తే. 

ఈశాన్య రాష్ట్రాలలో డ్రోన్లు
ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు ప్రాణాధార మందులు సకాలంలో చేరవేయడం ఎప్పుడూ సవాలే. కొండ దారుల్లో ప్రయాణం ఆలస్యం అవుతుంది. అదీగాక వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా ఆదివాసీలు నివాసాలు ఉంటారు. వీళ్లను కాపాడాలంటే సరైన సమయంలో మందులు చేరవేయడం చాలా అవసరం.

అందుకే ‘సస్టెయినబుల్‌ యాక్సెస్‌ టు మార్కెట్‌ అండ్‌ రిసోర్సెస్‌ ఫర్‌ ఇన్నోవేటివ్‌ డెలివరీ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌’ (సమృద్‌) సంస్థ ఐపిఇ గ్లోబల్, నీతి అయోగ్‌లతో కలిసి మరికొన్ని దాతృత్వ సంస్థల భాగస్వామ్యంతో ‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’ ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ డ్రోన్ల ద్వారా మందుల పంపిణి మొదలెట్టింది. అరుణాచలప్రదేశ్‌లో సాగుతున్న ఈ కార్యక్రమంలో డ్రోన్‌ ఆపరేట్‌ చేస్తున్న తొలి మహిళ నిక్‌ జాస్మిన్‌ సేవలు అందిస్తోంది.

ఆమె మొదట పారాగ్లైడర్‌
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్‌ జిల్లా నుంచి నిక్‌ జాస్మిన్‌ డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తుంది. ఇందుకోసం  అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద మందులు నిల్వ చేసే మందులు నిల్వ చేసే ఫ్రీజర్లు, ఫ్రిజ్‌లు ఉన్న మినీ హెలిపాడ్‌ వంటి స్టేషన్‌ వద్ద ఆమె విధులు నిర్వర్తించాలి. యాప్‌ ద్వారా ఫలానా చోటుకు మందులు పంపాలి అనే సందేశం రాగానే స్పందించాలి. ‘డ్రోన్లు 400 అడుగుల ఎత్తు నుంచి ప్రయాణం చేస్తాయి.

20 నుంచి 40 కిలోమీటర్ల దూరం వరకూ కచ్చితంగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకుంటాయి. రోజుకు పది ట్రిప్పులు వేయగలవు. మందుల ఉష్ణోగ్రతను మెయిన్‌టెయిన్‌ చేస్తూ ప్రయాణిస్తాయి. తమ సామర్థ్యాన్ని బట్టి బరువును మోస్తాయి’ అని తెలిపింది నిక్‌. ‘నేను ఎయిర్‌లైన్స్‌ టూరిజమ్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. పారాగ్లైడింగ్‌ చేసేదాన్ని. మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై కోసం డ్రోన్‌ ఆపరేటర్ల ఉద్యోగం ఉందని తెలిసి అప్లై చేశాను. నా పారాగ్లైడింగ్‌ అనుభవం దృష్ట్యా ఉద్యోగం వచ్చింది’ అని తెలిపింది నిక్‌. 

ఊరు కదిలి వచ్చింది
ఈ ఉద్యోగం కోసం నిక్‌కు శిక్షణ ఇచ్చారు. ‘డ్రోన్‌లోని అన్ని భాగాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన మందులు జాగ్రత్తగా ప్యాక్‌ చేయడం, ప్రీ ఫ్లైట్‌ పరీక్షలు, గాలి స్థితి, ఆడియో పైలట్‌ సిస్టమ్, జిపిఎస్‌ ట్రాక్‌ ఇవన్నీ సక్రమంగా ఉన్నాయనుకున్నాక డ్రోన్‌ను బయలుదేరదీయాలి’ అని తెలిపింది నిక్‌.

ఆమె ఉద్యోగం మొదలెట్టిన రోజు ఆమెను చూడటానికి ఊరు ఊరంతా వచ్చింది. ‘విమానాలు దగ్గరి నుంచి ఎగరడం మా ఊరి వాళ్లు చూడలేదు. ఒక బుల్లి విమానం లాంటిది పైగా ఒక అమ్మాయి ఎగుర వేయడం వారికి వింత. అందుకని ఊరంతా కదిలి వచ్చి చూసింది’ అని నవ్వింది నిక్‌.‘ఇది సరదా ఉద్యోగం కాదు. చాలా బాధ్యత. నాకు ఈ ఉద్యోగం ఎంతో నచ్చింది’ అని చెప్పిందామె.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top