నరసాపురం రూరల్: ప్రతి ఒక్కరూ భగవంతుని పట్ల భక్తి, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని త్రిదండి చినజీయర్ స్వామి ప్రబోధించారు. స్థానిక ఆదికేశవ ఎంబర్ మానార్ స్వామి ఆలయంలో రాజగోపురం నిర్మాణ పనులకు శనివారం ఆయన శాస్త్రోకంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సనాతన ధర్మం విశిష్టతను, రామానుజాచార్యుల వారి సిద్ధాంతాలను వివరించారు. వ్యవస్థల పట్ల విశ్వాసంతో మెలగాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. రాజగోపుర నిర్మాణానికి సహకరించిన దాతల కుటుంబ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ చైర్మన్ పుప్పాల కృష్ణారావు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆలయ ఈవో పి.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


