● 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు
● సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో ఘటన
కోదాడ రూరల్ : లారీని వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని మేళ్లచెర్వు ఫ్లై ఓవర్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ఇంట్రసిటీ స్మార్ట్ ట్రావెల్స్కు చెందిన బస్సు 46 మంది ప్రయాణికులతో ఏపీలోని ఏలూరుకు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోకి రాగానే విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. డ్రైవర్తో పాటు 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు అంబులెన్స్లో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. చికిత్స అనంతరం ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.


