● నానాటికీ తగ్గిపోతున్న పంటల విస్తీర్ణం
● ఇష్టానుసారంగా చేపల చెరువుల తవ్వకాలే కారణం
ఉంగుటూరు: డెల్టా ప్రాంతంలో పంట భూముల విస్తీర్ణం నానాటికి తగ్గిపోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమార్కులు అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా చేపలు చెరువులు తవ్వడంతో డెల్టా స్వరూపం నానాటికి మారిపోతోంది. ప్రధానంగా రావులపర్రు ఆయకట్టులో ఇబ్బడిముబ్బడిగా చేపల చెరువులు తవ్వడంతో ఆయకట్టులోని సగం విస్తీర్ణం చేపలు చెరువులుగా మారిపోయింది. ఇప్పటికే ఈగ్రామానికి పక్కనే ఉన్న రాచూరు, శీతారామపురం ఆయకట్టులో పూర్తిగా చెరువులుగా మారిపోయాయి. కాకర్లమూడి, దొంతవరం ఆయకట్టులో సగ భాగం చేపలు చెరువులుగా మారిపోయాయి. దీంతో కాలుష్య ప్రభావం ఎక్కువయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. చెరువులుగా మారని పంట చేలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చేపలు చెరువులుగా మార్చుకోవాల్సి వస్తోంది. ఏలూరు జిల్లాలో ఎక్కువ విస్తీర్ణం వరి పంట పండేది ఉంగుటూరు మండలమే. అలాంటిది ఇక్కడ పంట విస్తీర్ణం తగ్గిపోయి చేపల చెరువులు పెరిగిపోతున్నాయి. రావులపర్రు–రాచూరు మధ్యలో వంద ఎకరాలు విస్తీర్ణంలో చేపలు చెరువులు తవ్వకాలు జరగుతున్నాయి. ఇలా చెరవులు తవ్వడం వలన మత్స్య శాఖ, రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండినట్టే. దీంతో అక్రమార్కులు ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువుల తవ్వకాలు చేపడుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదు.


