ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో స్థానిక గ్జేవియర్ నగర్లోని పదో తరగతి మూల్యాంకన కేంద్రం సెయింట్ గ్జేవియర్ పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ‘‘పోరుబాట’’ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మలిదశ ఆందోళనలో భాగంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జీ. మోహన్, సెక్రటరీ జనరల్ ఎం. ఆదినారాయణ, కో–చైర్మన్లు జీ. వెంకటేశ్వరరావు, జంగం రవీంద్ర, ప్రధానోపాధ్యాయుల సంఘ జిల్లా అధ్యక్షుడు వీ. మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పీ.వెంకటేశ్వరరావు నిరసనకు సంఘీభావం తెలిపారు.


