
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నూజివీడు: గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ధర లేక మామిడి రైతులు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. దీంతో మామిడి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారాన్ని చెల్లించి మామిడి రైతులను ఆదుకోవాలన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర రకాలకు ధరలు దారుణంగా పడిపోయాయని, దీంతో కోతకూలి, కిరాయిలు కూడా రాని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయన్నారు. తోతాపురి కాయలు టన్ను కేవలం రూ.3వేల నుంచి రూ.4వేలు ధర మాత్రమే ఉందని, దీంతో కాయలు కోయడానికి ఎదురు పెట్టుబడి అవుతోందని రైతులు కోతలు కూడా కోయడం లేదన్నారు. చిత్తూరు జిల్లాలో జ్యూస్ ఫ్యాక్టరీలు ఇంత వరకు తెరవకపోవడంతో తోతాపురి కాయలను కొనేవారే లేరని పేర్కొన్నారు. అకాల వర్షాల కారణంగా మామిడి రైతులు నిండా మునిగిపోయారన్నారు. పూతలు, పిందెలు నిలుపుకునేందుకే రైతులు పురుగుమందులు పిచికారీ చేసేందుకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారన్నారు. అలాగే ఎరువులు, దుక్కి ఖర్చు, తోటల కాపలా ఖర్చు అన్నీ చూసుకుంటే రూ.50 వేలు పెట్టుబడి అయిందని, ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం చెల్లిస్తేనే రైతులు గట్టెక్కుతారన్నారు. మామిడి రైతులు ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారిని పట్టించుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల్లో నూజివీడు చిన్నరసం పేరుతో బోర్డులు పెట్టి వేరే ప్రాంతాల్లో కాసిన కాయలను విక్రయిస్తున్నారని, దీనిని బట్టే నూజివీడు ప్రాంతం మామిడికి ఎంతో ప్రసిద్ధో అర్ధమవుతుందన్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న మామిడిని సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలి
మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు