
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
కలెక్టర్ వెట్రిసెల్వి
పోలవరం రూరల్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కార్మోన్ముఖులు కావాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని పట్టిసీమ గోదావరి ఒడ్డున ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా వనం–మనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిని మనం కాపాడితే అదే మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ప్రధాన అంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించే ప్రతిజ్ఞ తీసుకుందామని చెప్పారు. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు, ప్లాస్టిక్ వస్తువులు, క్యారీ బ్యాగులు వాడకానికి ప్రతి ఒక్కరూ స్వస్తి చెప్పాలని అన్నారు. జిల్లాలో 4.50 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యమన్నారు. ఆర్డీఓ ఎంవీ రమణ, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ శుభం, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, జిల్లా ఆయుష్ అధికారి కె.రాణి, జిల్లా పర్యటక శాఖ మేనేజర్ ఎస్.పట్టాభిరామన్, తహసీల్దార్ సాయిరాజు, ఎంపీడీఓ శ్రీనివాసబాబు పాల్గొన్నారు.
యోగా స్ఫూర్తి : పట్టిసీమ గోదావరి తీరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం, గోదావరి మధ్యలో సుమారు వెయ్యి మందితో కలిసి యోగాసనాలు వేశారు.
క్రాంతికి అవార్డు
జంగారెడ్డిగూడెం: పర్యావరణ దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలో 19 వేలకు పైగా పాములను, వన్యప్రాణులను సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్న జంగారెడ్డిగూడేనికి చెందిన చదలవాడ క్రాంతికి అటవీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ వెట్రిసెల్వి చేతులమీదుగా పర్యావరణ వేత్త అవార్డు అందించారు.