
ఐటీఐ కౌన్సెలింగ్ ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల్లోని ఐటీఐ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం గురువారం ఏలూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలిరోజు 202 దరఖాస్తులకు గాను 100 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 77 మందికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించినట్టు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం ప్రధానాధికారి పి.రజిత తెలిపారు. జనరల్ పూల్కు సంబంధించిన ప్రవేశాలకు ఈనెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియను కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్వీ నాంచారయ్య పర్యవేక్షించారు.
మూగ జీవాలను హింసిస్తే చర్యలు
ఏలూరు (ఆర్ఆర్పేట): మూగజీవాలను హింసించినా, వధించినా, అక్రమంగా రవాణా చేసినా చర్యలు తప్పవని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ టి.గోవిందరాజు తెలిపారు. మూగజీవాలపై హింస, వధించడం, అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహనకు గురువారం స్థానిక గన్బజార్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలను వధించరాదన్నారు. అలాగే పశువులను విచ్చలవిడిగా రోడ్లపై వదలడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, పశు యజమానులకు నోటీసు జారీ చేసి జరిమానా విధించాలన్నారు. జంతు సంరక్షణ కోసం గ్రామ, డివిజన్, జిల్లాస్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పశు సంవర్ధకశాఖ ఏడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు ప్రవేశాలను అడ్డుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మడం, ముందుస్తు అడ్మిషన్లు నిర్వహించడం చేస్తున్నారని, వారిని అదుపు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు పతివాడ నాగేంద్రబాబు మాట్లాడుతూ విద్యాసంస్థల్లో పుస్తకాలు అమ్మడం నిషేధమన్నారు. జూన్ 12 వరకు పాఠశాలలు నిర్వహించరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా పలు స్కూళ్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు కె.రోహిత్, కె.గోవిందు, ఎన్.సాయి పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
భీమవరం (ప్రకాశంచౌక్): మొక్కలు నాటడంతో పాటు, ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి కాలుష్య కారకంగా ఉన్న ప్లాస్టిక్ నియంత్రణే లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అంతట శ్రీవనం–మనం్ఙ పేరిట మొక్కలు నాటడం, కాలువలు, డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, అధికారులు భీమవరం కలెక్టరేట్లో మొక్కలు నాటారు. అనంతరం విస్సాకోడేరు కాలువ వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలను, జేపీ రోడ్డులోని అడ్డ వంతెన వద్ద కాలువ గట్లపై ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాలఒగన్నారు. కాలువల్లో వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని పరివీలించారు. జిల్లావ్యాప్తంగా 3.85 లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అటవీశాఖ పర్యవేక్షణలో జిల్లాలోని వెంకటరామన్నగూడెం, సీతారాంపురం, కొణితివాడ గ్రామాల్లో నర్సరీలను అభివృద్ధి చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు, జిల్లా అటవీ శాఖ అధికారి పాల్గొన్నారు.