
మద్ది క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం
జంగారెడ్డిగూడెం: మద్ది క్షేత్రంలో ఉపాలయమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. హనుమద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆంజన్నకు ప్రభాత సేవ, నిత్యార్చన, నిత్యహోమం, బలిహరణలు నిర్వహించారు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక కల్యాణం వైభవంగా జరిపారు. ఆలయ ముఖమండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల నడుమ వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణ క్రతువు నిర్వహించారు. నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్వామి వారి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించబడునని దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు.
శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లకు కొత్త భవనాలు
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిలాల్లో శిథిలావస్థలో ఉన్న 4 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు రూ.12 కోట్లతో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్ ఎం.ముక్కంటి చెప్పారు. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని కై కలూరు, పెదపాడు, గుండుగొలను, ముదినేపల్లిలలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల స్థానంలో రూ.12 కోట్లతో కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలోని 52 భవనాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.72 కోట్లు మంజూరు చేసిందని, మరమ్మతు పనులను పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, సాంఘిక సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం, సర్వశిక్షా అభియాన్, పబ్లిక్ హెల్త్ శాఖలకు అప్పగించడం జరిగిందన్నారు. 90 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు జూన్ మొదటి వారం నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల రక్షణ నిమిత్తం 56 హాస్టళ్లలో 448 సీసీ కెమెరాలు అమర్చామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6,900 మంది విద్యార్థుల చేరిక లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత విద్యా సంవత్సరంలో హాస్టళ్లలో 10వ తరగతిలో 87 శాతం, ఇంటర్మీడియెట్లో 89 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ముక్కంటి వివరించారు.