
బ్రహ్మోత్సవ వైభవం
ద్వారకాతిరువుల: సర్వాభరణ భూషితుడైన శ్రీవారు పెండ్లి కుమారుడిగా, నుదుటున కల్యాణ తిలకం.. బుగ్గన చుక్కలతో పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా శోభిల్లారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ ఏఈఓ పి.నటరాజారావు శ్రీహరి కళాతోరణ వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి నిత్య కల్యాణ మండపం వద్దకు తొళక్క వాహనంపై తీసుకెళ్లారు. అక్కడ పుష్పమాలికలతో విశేషంగా అలంకరించిన వేదికపై ఏర్పాటు చేసిన రజిత సింహాసనంపై శ్రీవారు, అవ్మువార్లను వేంచేపు చేసి అలంకరించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్ఛరణల నడుమ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేసే వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి దంపతులు స్వామి, అమ్మవార్లకు పూలు, పండ్లు సమర్పించి, పూజాధికాలు నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణల నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుక చూపరులకు కనువిందు చేసింది. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలంకరించాయి. రాత్రి గజ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారి శ్రీమహావిష్ణు అలంకారం భక్తులకు నేత్రపర్వమైంది.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 7గంటల నుంచి–భజన కార్యక్రమాలు
8 గంటల నుంచి – భక్తిరంజని
మధ్యాహ్నం12 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు
సాయంత్రం 4గంటల నుంచి–నాదస్వరకచేరి
5 గంటల నుంచి – హరికధ
6గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు
రాత్రి 8 గంటల నుంచి – అంకురార్పణ, రుత్విగ్వరణ, ధ్వజారోహణం
9 గంటల నుంచి – హంసవాహనంపై శ్రీవారికి తిరువీది సేవ
9 గంటల నుంచి – సురభి నాటకం
శ్రీవారి ప్రత్యేక అలంకారం : మత్స్యావతారం
అట్టహాసంగా వైశాఖ దివ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెండ్లి కొడుకుగా చిన్న వెంకన్న ముస్తాబు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గజ వాహనంపై అట్టహాసంగా తిరువీధి సేవ

బ్రహ్మోత్సవ వైభవం

బ్రహ్మోత్సవ వైభవం

బ్రహ్మోత్సవ వైభవం