
అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి
ఏలూరు(మెట్రో): దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజును నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి సీతారామ రాజు విగ్రహానికి కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి చేసిన స్వాతంత్య్ర పోరాటం ఎందరో వీరులకు స్పూర్తినిచ్చిందన్నారు. దేశం కోసం, ప్రజల కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, సెట్వెల్ సీఈఓ కె.ఎస్.ప్రభాకరరావు, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభి, కలెక్టరేట్ ఆవరణలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్లోని పలు విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సైన్యానికి సెల్యూట్
బుట్టాయగూడెం: పహల్గాం దాడికి ప్రతీ కారంగా ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సిందూర్పై మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పందించారు. బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ మెరుపు దాడులు చేసిన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. తీవ్రవాద శిబిరాలు పూర్తిగా తుడిచిపెట్టే ప్రక్రియలో భారత సైన్యానికి మరింత బలం చేకూరాలని అన్నారు.
విభిన్న ప్రతిభావంతులకు డీఎస్సీ శిక్షణ
ఏలూరు (టూటౌన్): జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల కోసం ఉచిత మెగా డీఎస్సీ క్రాష్ కోర్సు శిక్షణను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ బి.రామ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ టీచర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేశారన్నారు. కనీసం 40 శాతం వైకల్యం కలిగిన వారు మాత్రమే అర్హులన్నారు. శిక్షణ కోసం ఎంపిక టెట్ స్కోర్ ఆధారంగా ఉంటుందని చెప్పారు. ఎంపికయిన అభ్యర్థులకు ప్రత్యేక బోధనా పద్ధతులలో శిక్షణ, స్టడీ మెటీరియల్స్, ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారన్నారు.
9న కలెక్టరేట్ వద్ద ధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏలూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ఆ సంఘ ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టీ.రామారావు, బీ.రెడ్డి దొర ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందన్నారు. జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్ట ప్రకారం అన్ని పాఠశాలల్లో మాతృభాషలో విద్యాబోధన జరగాలని, 12వ పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రశాంతంగా ఐసెట్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలో ఐసెట్ పరీక్ష బుశారం ప్రశాంతంగా జరిగింది. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ సెంటర్లో ఉదయం 180 మందికి గాను 155 మంది, మధ్యాహ్నం 180 మందికి 157 మంది హాజరయ్యారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 196 మందికి 177 మంది, మధ్యాహ్నం 196 మందికి 166 మంది హాజరయ్యారు. ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉదయం 100 మందికి 84 మంది, మధ్యాహ్నం 100 మందికి 87 మంది హాజరయ్యారు.
సాగులో డ్రోన్ల వినియోగంపై అవగాహన
ఏలూరు(మెట్రో): వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రూప్ కన్వీనర్లకు, అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపర్చడంలో డ్రోన్ల పాత్ర ముఖ్యమైందన్నారు. జిల్లాలో 27 మండలాల్లో తొలివిడతగా సబ్సిడీపై డ్రోన్లను అందించేందుకు దరఖాస్తులు తీసుకున్నామన్నారు.

అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి