పెనుమంట్ర : వరి, మొక్కజొన్న లాంటి పంటల్లో ఎరువుల వినియోగం చాలా ఎక్కువగా ఉందని, దానికి తగ్గట్టు దిగుబడిలో పెరుగుదల కనిపిస్తుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రెండో రోజు గోదావరి మండల పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవకాశం ఉందని, సిఫార్సు చేస్తున్న పురుగు మందుల మోతాదును కూడా పునః పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి శివనారాయణ మాట్లాడుతూ పరిశోధనా స్ధానాలు, విత్తనోత్పత్తి సంస్ధలపై భారం తగ్గించడానికి రైతు విత్తనోత్పత్తిదారులను గ్రామాలలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని విస్తరణ కేంద్రాలను ఆదేశించారు. వరి ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పండించే 127 లక్షల టన్నుల ధాన్యం నుంచి సుమారు 80 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని, మన రాష్ట్ర అవసరాలకు సుమారు 50 లక్షల టన్నుల బియ్యం సరిపోతుందని, మిగిలిన 30 లక్షల టన్నుల బియ్యాన్ని బాసుమతి యేతర రకాల కేటగిరి కింద ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల రైతులకు అధిక ఆదాయంతో పాటు రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి మరింత మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ టి.శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.