
ప్రశాంతంగా పాలిసెట్
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం బుధవారం నిర్వహించిన పాలిసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలు ఏలూరు జిల్లాలోని ఏలూరులో 10 కేంద్రాల్లో, నూజివీడులో రెండు కేంద్రాల్లో జరిగాయి. మొత్తం 4312 మంది విద్యార్థులకు 3714 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఏలూరులో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 3542 మంది విద్యార్థుల్లో 2225 మంది బాలురు, 1,317 మంది బాలికలు పరీక్షలు రాయాల్సి ఉండగా 1924 మంది బాలురు, 1091 మంది బాలికలు మొత్తం 3015 మంది రాశారు. నూజివీడులోని రెండు పరీక్షా కేంద్రాల్లో 498 మంది బాలురకు 452 మంది పరీక్ష రాయగా, 272 మంది బాలికలకు 247 మంది మొత్తం 699 మంది పరీక్షలు రాశారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని ఏలూరు జిల్లా పాలిసెట్ కో–ఆర్డినేటర్ పెదపట్ల సుబ్రహ్మణ్యం తెలిపారు.