
రూ.39.50 లక్షల గంజాయి పట్టివేత
ఏలూరు (టూటౌన్): ఏలూరు పోలీసులు రూ.39.50 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ టీం ఐజీ ఏ.రవికృష్ణ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం సీఐ వి.కృష్ణబాబుకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా, స్థానిక పోలీసులతో కలిసి ఈగల్ టీం ఈ ఆపరేషన్ను చేపట్టిందని చెప్పారు. మంగళవారం ఉదయం జంగారెడ్డిగూడెం ఎస్సై ఓ.జబీర్, ఈగల్ టీం దేవరపల్లి–తల్లాడ మార్గంలోని మార్కెట్ యార్డు చెక్ పోస్టు వద్ద రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో గంజాయితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన మనం చంద్రదొర అలియాస్ దొరబాబు, నాయుడు రాజా, బొంతు దుర్గా సతీష్, కుడితి చిన్ని, అనకాపల్లి జిల్లాకు చెందిన ఈపు ధనరాజ్ను అరెస్టు చేశారు. టాటా వ్యాన్, డిజైర్ కారును సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో మొత్తం 394.795 కిలోల గంజాయి, రెండు వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, ఇతర నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఐజీ రవికృష్ణ చెప్పారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారిని అభినందించారు.