
జూలై నుంచి ఆక్వా పంట విరామం
పెనుమంట్ర: ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణతో పాటు ప్రాసెసింగ్ యూనిట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే జూలై నుంచి ఆక్వా సాగు విరామం ప్రకటిస్తామని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్రాజు అన్నారు. మంగళవారం రాత్రి పెనుమంట్రలోని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాస్ రాజు నివాసంలో ఆక్వా రైతుల అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న భగవాన్ రాజు మాట్లాడుతూ కూలీ ధరలతో పాటు ఫీడ్ ధరలు గణనీయంగా పెరగడం, రొయ్యల ధరలను సిండికేట్లు భారీగా తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సిండికేట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే క్రాప్ హాలిడే ఒకటే సరైన పరిష్కారం అన్నారు. జూలై నుంచి ఆక్వా సాగును నిలిపివేయాలని ప్రకటించారు.