
వ్యవసాయంలో శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ఏలూరు (మెట్రో): మారుతున్న కాలానికనుగుణంగా వస్తున్న శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ రంగంలో అమలు చేయడం ద్వారా అధిక దిగుబడులను సాధించాలని ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ అన్నారు. ఏలూరులోని ఏరువాక కేంద్రంలో మార్టేరు వ్యవసాయ పరిధిశోధనా స్థానం సహ సంచాలకులు డా. టి.శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. జి.శివనారాయణ మాట్లాడుతూ సార్వా, దాళ్వా పంటకాలానికిగాను ఏరువాక కేంద్రం, వ్యవసాయ శాఖ, రైతు సేవా కేంద్రం సిబ్బందికి మునుపు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఏరువాక కేంద్రంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం, రెండు మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ భాషా, ఏరువాక కేంద్రం, ఏలూరు సమన్వయ కర్త డా. కె.ఫణికుమార్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు ప్రధాన శాస్త్రవేత్త డా.సీహెచ్. శ్రీనివాసు, మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, అధిపతి డా. కె.మోహనరావు, ఏరువాక కేంద్రం, ఏలూరు శాస్త్రవేత్త ఎన్.నాగేంద్ర బాబు, రైతు శిక్షణా కేంద్రం ఏడీఏ లలిత సుధ, సెరికల్చర్ అధికారి శ్రీనివాస్, మత్స్య శాఖ అధికారి రాజకుమార్, ఏలూరు ఉద్యాన అధికారి కరణ్ తదితరులు పాల్గొన్నారు.