
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దు
ఏలూరు (టూటౌన్) : పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకీ ఆయిల్పామ్ విస్తీర్ణం పెరుగుతోందని, దేశంలోనే అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఉందన్నారు. సహకార రంగంలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని కోరారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో వస్తున్న రికవరీ శాతం ఆధారంగానే ధర నిర్ణయం జరుగుతుందని చెప్పారు. కర్మగారాన్ని ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని, రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని శ్రీనివాస్ హెచ్చరించారు.