ఏలూరు(ఆర్ఆర్పేట): నగరంలోని రామచంద్రరావుపేట శ్రీ శర్వాణీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని ముత్యాల గాయత్రి గత సెప్టెంబర్లో జూనియర్ చాంబర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జేసీ– శాట్ లెవల్–2 ఆల్ ఇండియా పోటీ పరీక్షల్లో పాల్గొని జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో గాయత్రిని పలువురు అభినందించారు. గాయత్రి ఇటువంటి అద్భుత విజయాలు మరిన్ని సాధించాలని ప్రధానోపాధ్యాయిని సీహెచ్ సత్యశారద ఆకాంక్షించారు. జేసీ–ఐ జాతీయ ఉపాధ్యక్షుడు బీ. సిద్థార్థ, జోన్– 26 అధ్యక్షుడు ఎంఆర్టీ భరత్, జే. ఆదిత్య, ఏలూరు ఐపీపీ కేఎన్ రోహిత్, ఏలూరు జోన్ ఎస్ ప్రెసిడెంట్ అరవింద్ గాయత్రికి రూ.51 వేలు నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించి అభినందించారు. పాఠశాల డైరెక్టర్ కే.మదనమోహనరాజు, ఉపాధ్యాయలు విద్యార్థినిని అభినందించారు.
ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): ఆదివాసీ సంక్షేమ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ భాషా ఒక ప్రకటనలో కోరారు. పోలవరం మండలం జిల్లెల్లగూడెం, ప్రగడపల్లి, వింజరం పంచాయతీల్లో గత మూడు దశాబ్దాలుగా గిరిజనుల సాగులో ఉన్న భూములకు సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాను మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధేశ్వరరావు ప్రారంభిస్తారన్నారు.
లైంగిక వేధింపులపై
కేసు నమోదు
ఆకివీడు: చెరుకుమిల్లి గ్రామ శివారు ఉప్పరగూడెంకు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు యత్నించిన దోనాద్రి నరసన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం చెప్పారు. ఈ నెల 6వ తేదీన నిందితుడు ఇంటికి రమ్మని భార్యతో ఫోన్ చేయించాడని, తాను ఇంటికి వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడేందుకు యత్నించగా అదే సమయంలో తన భర్త ఇంటికి వచ్చి తన కోసం గట్టిగా కేక వేయగా నిందితుడు పరారయ్యాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధిలో...
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీక్షీరారామలింగేశ్వరస్వామిని తెలంగాణ రాష్ట్ర యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన లక్ష్మీనరసింహాచార్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్దనస్వామి, లక్ష్మీపార్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ వాసు స్వామివారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని అందజేశారు. లక్ష్మీనరసింహాచార్యులు మాట్లాడుతూ క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.