ఏలూరు టౌన్: చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందారు. ఏలూరు రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ఏలూరు సత్రంపాడు ప్రాంతానికి చెందిన సందోలు నవీన్ సాగర్(42) పెదవేగి మండలం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఓఈటిగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల రైల్వే ట్రాక్ సమీపంలో రైలు పట్టాలను దాటుతున్న సమయంలో గుర్తుతెలియని రైలు ఢీకొట్టింది. నవీన్ సాగర్ అక్కడికక్కడే మృతిచెందారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాక్కు దూరంగా మృతదేహం ఉండడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్య...హత్య? లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
‘పది’ పరీక్షల సిబ్బంది నిబంధనలు పాటించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో పదో తరగతి పరీక్షల విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ సూచించారు. పరీక్షల సిబ్బంది విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని, చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షా కేంద్రంలోని సిబ్బందితో బంధుత్వాలు లేవని విధిగా సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. స్టోరేజ్ పాయింట్లో ప్రశ్నాపత్రాలు తీసుకొన్న వెంటనే సరైన సంఖ్యలో ఉన్నాయో లేవో, ఆ రోజుకి సంబంధించిన సబ్జెక్ట్/ పేపర్ కోడ్ వంటివి సరిచూసుకోవాలని, పుకార్లు, అనధికార వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే వ్యక్తులపై సైబర్ నేరం కింద చర్యలు తీసుకుంటారన్నారు. విద్యార్థుల సహాయార్థం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో 8466974001 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.