పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో కళా పరిషత్ ఆధ్వర్యంలో రెండో రోజు ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి. ఆదివారం మూడు నాటికలు ప్రదర్శించారు. ఇది రహదారి కాదు, (అ)సత్యం, మా ఇంట్లో మహాభారతం నాటికలు ఆకట్టుకున్నాయి. సమాజంలో దారితప్పిన యువ జంటకు సందేశాన్ని అందించేలా సాగిన మిత్ర క్రియేషన్స్ వారి శ్రీఇది రహదారి కాదుశ్రీ నాటికను ఆకురాతి భాస్కర్ రచించగా, ఎస్ఎం బాషా దర్శకత్వం వహించారు. మద్దుకూరు ఆర్ట్ క్రియేషన్స్, చిలకలూరిపేట వారి మా ఇంట్లో మహాభారతం నాటికను మద్దుకూరి రవీంద్రబాబు రచించగా.. నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. చెతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారు రచించిన అ(సత్యం) నాటిక కంటికి కనిపించేదంతా సత్యం కాదు.. కనిపించనిదంతా అసత్యం కాదు. అబద్ధమైనా సరే అది ఒక మంచికి దోహదపడితే అది సత్యం అని తెలిపేదే ఈ నాటిక. పిన్నమనేని మృత్యంజయరావు రచించగా.. పి.బాలాజీనాయక్ దర్శకత్వం వహించారు.
సందేశాత్మకంగా కళా పరిషత్ నాటికలు