అత్తిలి: బల్లిపాడు శ్రీమదనగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు శ్రీపుష్పయాగోత్సవంతో ముగిశాయి. శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించిన పల్లకీలో ఉంచి పవళింపు సేవ జరిపారు. ఆలయ అర్చకులు దంపతులకు తాంబూళాలు అందజేశారు. హాజరైన మహిళా భక్తులకు కుంకుమ భరిణీలు పంపిణీ చేశారు. లక్కీడ్రా నిర్వహించి డ్రాలో గెలుపొందిన ముగ్గురుకి స్వామివారి చిత్రపటాలను ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు 12 రకాల ప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గారపాటి వెంకట సుబ్బారావు, గారపాటి శివకృష్ణ అశోక్, బుద్ధాల భాస్కరరావు, ఆకుల వెంకటేశ్వరరావు, తోట శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్ వ్యవహారంపై విచారణ
భీమవరం: భీమవరం పట్టణంలోని శ్రీవేంకటేశ్వర బధిరోన్నత పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిని అధికారులు ఆదివారం విచారించారు. ప్రిన్సిపాల్ పి.పద్మనాభరాజు తమను దూషించారంటూ పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 19 మంది ప్రైవేటు ఉద్యోగులు ఇటీవల ఆరోపించారు. ఈ విషయమై ఈనెల 10న పాఠశాలలో ఆందోళన వ్యక్తం చేయడంతో తాను తిట్టడం వాస్తవమని, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తిట్టానని, మన్నించాలంటూ లేఖను ప్రిన్సిపాల్ రాసి ఇచ్చారు. ఉద్యోగం నుంచి కూడా తప్పుకుంటున్నానంటూ చెప్పారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా తమకు న్యాయం జరగడంలేదని ఉద్యోగినులు ఆరోపించారు. దీనిపై నాలుగు రోజుల కిందట తమకు వచ్చిన ఆదేశాల మేరకు విచారణకు వచ్చినట్లు తితిదే విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మి చెప్పారు. నివేదికను ఈవోకు అందజేస్తానన్నారు.
పోస్టాఫీసులో చోరీ యత్నం
జంగారెడ్డిగూడెం: స్థానిక హెడ్ పోస్టాఫీసులో ఆదివారం చోరీ యత్నం జరిగింది. పోస్టాఫీసు వెనుక తలుపుల తాళాలు పగులగొట్టి దుండగుడు లోనికి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. నైట్ వాచ్మన్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే సరికి పోస్టాఫీసు వెనుక తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టాఫీసులో ఏవీ చోరీకి గురికాలేదని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్
భీమవరం: ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి ఎక్కువ రేటుకు విక్రయిస్తున్న ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ బలరామరాజు తెలిపారు. ప్రధాన ముద్దాయి షణ్ముగం ప్రభును పీటీ వారెంట్పై చైన్నె నుంచి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. ఆరుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో గత జనవరిలో ముద్దాయిలను గుర్తించి వారిని అరెస్ట్ చేశామన్నారు.
ముగిసిన మదనగోపాల స్వామి కల్యాణోత్సవాలు