ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరుకు చెందిన ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (టెకు బ్యాంక్) వ్యాపారాన్ని మరిన్ని జిల్లాలకు విస్తరించాలని ఆ బ్యాంక్ మహాజన సభ ఆమోదించింది. ఆదివారం వైఎంహెచ్ఏ హాలులో టెకు బ్యాంక్ మహాజన సభ బ్యాంక్ ఛైర్మన్ అంబికా ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో బ్యాంకు అభివృద్ధిపై సమీక్షించారు. కొత్త సభ్యత్వాలు, వాపసు చేసిన వాటాధనం ఆమోదించారు. వాయిదా మీరిన అప్పులపై సమీక్షించారు. బ్యాంకు చైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ ప్రసుత్తం బ్యాంకు వ్యాపార పరిధి ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో విస్తరించి ఉందని, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, విశాఖపట్నం జిల్లాకు విస్తరించేందుకు ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంకు డైరెక్టర్లు సిబ్బంది, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు.