క్రొవ్విడిలో దారుణం
నిడమర్రు: కొల్లేరు జీరాయితీ చేలల్లో చేపలు పడుతున్నాడంటూ ఓ బాలుడిని కొట్టి గొలుసుతో కట్టేసిన సంఘటన శుక్రవారం నిడమర్రు మండలం క్రొవ్విడిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం 5వ కాంటూరు పరిధిలో నిరుపయోగంగా ఉన్న చేలల్లో ఉప్పరగుడెంకు చెందిన తాటిపర్తి బుజ్జన్న కుమారుడు లోకేష్ వరుణ్ చేపలు పడుతుండడం గమనించిన అదే గ్రామానికి చెందిన గండికోట వెంకన్న, పండు అతన్ని గ్రామంలోకి తీసుకొచ్చి గొలుసుతో కట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లి ప్రాధేయపడినా వదలలేదు. లోకేష్ తాత, మావయ్య విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మందలించారు. అప్పుడు బాలుడ్ని విడిచి పెట్టినట్లు తెలిసింది. లోకేష్ తండ్రి సాక్షితో మాట్లాడుతూ సుమారు 3 గంటల పాటు తన కొడుకుని కట్టేశారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.