ఏలూరు (టూటౌన్): ఏలూరును ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని అన్నారు. శనివారం ఏలూరు ఆర్ఆర్ పేటలోని ఎన్టీఆర్ పార్కు వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ రిజర్వాయర్ ప్రహరీ గోడకు పెయింటింగ్ వేశారు. సభలో ప్రతిజ్ఞ నిర్వహించి స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. చిత్తశుద్ధితో అందరూ పరిశుభ్రత పాటించాలని చెప్పారు. వంద మైక్రోన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ బదులు క్లాత్, జ్యూట్ వంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఉపయోగించాలన్నారు. మేయర్ షేక్ నూర్జహాన్, కమిషనర్ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.