జంగారెడ్డిగూడెం: మండలంలోని చల్లవారిగూడెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఓపీడీఆర్ నిజ నిర్ధారణ కమిటీ శనివారం పర్యటించింది. ఐదుగురు సభ్యుల బృందం కాలనీలో పర్యటించి ప్రజల నుంచి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో కూనవరం, వేలేరుపాడు, కక్కునూరు, పోలవరం, వీఆర్పురం, వి.రామచంద్రాపురం, చింతూరు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు చల్లవారిగూడెంలో ఇళ్లను ఇచ్చారని.. ఆ ప్రాంతంలో పెద్ద గోతులు, తుప్పలతో నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. దీంతో నిర్వాసితులే సొంత సొమ్ములు ఖర్చు చేసి గోతులను సరిచేసుకున్నారని సదరు సొమ్మును ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. చల్లవారిగూడెం ఆర్అండ్ఆర్ కాలనీలో అసంపూర్తి నిర్మాణాలు 2 వేలకు వరకు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే నిర్మించాలన్నారు. నాలుగు ఓవర్ హెడ్ ట్యాంక్ల్లో ఒక్కటే పనిచేస్తుందని, నీటి కోసం కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే మిగిలిన మూడు ఓవర్హెడ్ ట్యాంక్లను వాడుకలో తీసుకురావాలన్నారు. వెంటనే రైతు భరోసా, తల్లికి వందనం తదితర సంక్షేమ కార్యక్రమాలు కాలనీలో వెంటనే అమలు చేయాలని డిమండ్ చేశారు. కమిటీలో జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కరరావు, సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.