
శాంతించిన గోదావరి
కాటన్ బ్యారేజీ నుంచి 3.58 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల
కాటన్ బ్యారేజీ నుంచి విడుదల
చేస్తున్న మిగులు జలాలు
దవళేశ్వరం: గోదావరి క్రమంగా శాంతించింది. ధవళేశ్వరం వద్ద వరద నీటి ఉధృతి తగ్గింది. దీంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. ధవళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 10.50 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి డెల్టా కాలువలకు సంబంధించి 14,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 5,000, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 6,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీలోని మొత్తం 175గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.34 మీటర్లు, పేరూరులో 9.61 మీటర్లు, దుమ్ముగూడెంలో 6.96 మీటర్లు, భద్రాచలంలో 23.30 అడుగులు, కూనవరంలో 11.34 మీటర్లు, కుంటలో 4.24 మీటర్లు, పోలవరంలో 8.68 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.33 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.