
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
● విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ ప్రసాద్
● తూర్పు గోదావరి జిల్లాలోని మహిళా సర్పంచ్లకు శిక్షణ ప్రారంభం
సామర్లకోట: మహిళా ప్రజా ప్రతినిధులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎస్వీ ప్రసాదరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మహిళా సర్పంచ్లకు మూడు రోజుల శిక్షణను సోమవారం ఆయన ఈటీసీలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళా సర్పంచ్లు స్వతంత్రంగా పని చేయాలని సూచించారు. రాజకీయంగా ఎదగడానికి సర్పంచ్ పదవి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రజల సమస్యలను దగ్గర ఉండి తెలుసుకొనే అవకాశం సర్పంచ్లకే ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని, అయితే సర్పంచ్లు వెనుబడుతున్నారన్నారు. మహిళా సర్పంచ్లు స్వయం నిర్ణయాధికారంతో పాలన సాగించాలన్నారు. ఉత్తమ సేవలు అందిస్తే గ్రామంలోని ప్రతీ మహిళ ఆమెను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుందన్నారు. కోర్సు డైరెక్టరు కె. సుశీల శిక్షణ కేంద్రం ఆవరణలో మహిళా సర్పంచ్లను గ్రూపులుగా ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చలు జరిపే ఏర్పాట్లు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు ఎస్ఎస్ శర్మ, ఎం చక్రపాణిరావు, ఎ.రవిశంకర్ శిక్షణ నిర్వహించారు.