
మీ నిర్లక్ష్యంతో 400 మందికి నష్టం
● కోర్టు సాకుతో తప్పించుకోవద్దు
● స్పందనలో సచివాలయ ఏఎన్ఎంల ఆవేదన
కాకినాడ క్రైం: అర్హులైన తమకు ఎంపీహెచ్ఏఎఫ్ (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్)గా పదోన్నతి కల్పించడంలో ఉద్దేశ పూర్వక జాప్యం తగదని సచివాలయ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురి కోసం నాలుగొందల మంది భవితకు చేటు చేయవద్దని అధికారులను వేడుకున్నారు. ఈ మేరకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు సోమవారం కాకినాడ కలెక్టరేట్కు వచ్చి స్పందన కార్యక్రమంలో తమ ఆవేదనను వెళ్లగక్కారు. డీఆర్వో వెంకట్రావుకు వినతి సమర్పించారు. గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం సచివాలయ ఏఎన్ఎంలకు పదోన్నతి కల్పించే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటించిందన్నారు. ఈ ప్రకటనకు అనుగుణంగా అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తి కావస్తుండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కనీసం ప్రారంభం కాలేదని వెల్లడించారు. పదోన్నతుల కోసం ధ్రువపత్రాల పరిశీలన గత నెల 26 నుంచి 29 తేదీల మధ్య జరిగిందని, తదనంతరం సీనియారిటీ జాబితా నేటికీ ప్రచురించి ప్రదర్శించలేదని డీఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై డీఆర్వో డీఎంహెచ్వోను ప్రశ్నించగా, మార్కుల వెయిటేజ్, ఎస్సీ చట్టంలో క్లాసిఫికేషన్ అంశాల ప్రాతిపదకన కోర్టులో కేసు వేయడం వల్ల సీనియారిటీ జాబితాను ప్రదర్శించకుండా నిలిపామని సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏఎన్ఎంలు ఇతర జిల్లాల్లో జీవోల ఆధారంగా ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేస్తుంటే మీకు మాత్రమే వచ్చిన అడ్డంకి ఏంటని ప్రశ్నించారు. కోర్టు సాకుతో పదోన్నతుల ప్రక్రియ చేపట్టకుండా తప్పించుకోవడం సబబు కాదని, మీ నిర్లక్ష్యం 400 మంది భవితకి నష్టమని తమ ఆవేదనను వెళ్లగక్కారు.