
గోకులంలో బెల్ట్షాపు!
పిఠాపురం: కిళ్లీ కొట్టు, కిరాణా కొట్టు అది ఇదీ అని కాదు ఎక్కడ చూసినా బ్రాందీ బెల్టుషాపులే. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతున్నదనడానికి ప్రతీ గ్రామంలోను ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చివరకు గోవులను సంరక్షించడానికి ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోకులంను సైతం వదలలేదు కూటమి నేతలు. పిఠాపురం మండలం రాపర్తిలో గోవుల కోసం నిర్మించిన గోకులంలో బ్రాందీ షాపు ఏర్పాటు చేయడం చూసిన స్థానికులు మరీ ఇంత దారుణమా? మూగజీవాలు ఉండాల్సిన చోట మద్యం షాపు ఏమిటంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. బ్రాందీషాపు అంటూ బోర్డు పెట్టి మరీ విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నప్పటికీ అది లైసెన్సు ఉన్న బ్రాందీ షాపు కాకుండా బెల్టుషాపు కావడం కొసమెరుపు.
మద్యం తాగి బైక్ నడిపిన వారికి జైలు
కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో 8 మందికి రెండు రోజుల చొప్పున జైలు, 9 మందికి రూ. 10 వేల చొప్పున జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సోమవారం కోర్టులో 17 మందిని హాజరుపర్చగా వారికి పై విధంగా జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.