నిమ్మ రైతు కంట చెమ్మ | - | Sakshi
Sakshi News home page

నిమ్మ రైతు కంట చెమ్మ

May 3 2025 7:56 AM | Updated on May 3 2025 7:56 AM

నిమ్మ

నిమ్మ రైతు కంట చెమ్మ

తగిన రేటు లేదు

నాకు మూడెకరాల్లో నిమ్మ పంట ఉంది. పెట్టుబడి రూ.4.50 లక్షలైంది. సేంద్రియ ఎరువులు, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.8 లక్షలైంది. నిమ్మకాయలకు మార్కెట్లో తగిన రేటు లేదు. దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల (20 క్వింటాళ్లు) దిగుబడి వస్తోంది. అయినా గిట్టుబాటు ధర రావడం లేదు. వచ్చిన దానిలో సగం ఖర్చులకే సరిపోతుంది. ఎకరాకు రూ.1.30 లక్షల పెట్టుబడి అవుతోంది. పశువుల ఎరువు ఎక్కువగా వాడాలి. పూతలు రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గింది. పెట్టుబడి కూడా రాదు. కౌలు రైతుల పరిస్థితి దారుణం. ఎకరం కౌలు రూ.1.30 లక్షలుంది.

– శ్రీరంగం వీరనాగు,

నిమ్మ రైతు, కొత్తగూడెం, దేవరపల్లి మండలం

పెట్టుబడి ఎక్కువ

నాకు నాలుగెకరాల్లో నిమ్మ పంట ఉంది. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం కిలో కాయల ధర రూ.70 పలుకుతోంది. ఈ ధర లాభసాటిగానే ఉంది. అంతర పంటల సాగు గిట్టుబాటు కాకపోయినా నిమ్మ పంట రైతులను ఆదుకొంటుంది. మార్కెట్‌కు క్వింటాల్‌ కాయలు తీసుకు వెళితే రూ.6 వేలు వస్తోంది. దిగుబడులు లేవు. ప్రస్తుత కౌలుదారులకు ధర గిట్టుబాటు కాదు. నిమ్మ సాగుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది.

– లకంసాని శ్రీనివాస్‌, నిమ్మ రైతు,

చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం

మూడు టన్నుల దిగుబడి తగ్గింది

ఎకరాకు దిగుబడి మూడు టన్నులు తగ్గింది. భూసారం తగ్గడం, ఎరువుల వినియోగం పెరగడంతో ఏటా దిగుబడులు తగ్గుతున్నాయి. సేంద్రియ పద్ధతిలో తోటలు పెంచి, నవధాన్యాల పంట వేసి, భూమిలో కలియదున్నితే భూసారం పెరిగి తోటలు కోలుకుంటాయి. ప్రస్తుతం ధర బాగుంది. కానీ, కాయలు లేవు.

– సింగులూరి రామ్మోహనరావు,

నిమ్మ రైతు, యాదవోలు, దేవరపల్లి మండలం

దేవరపల్లి: దిగుబడులు తగ్గినా మార్కెట్లో గిట్టుబాటు ధర పలకకపోవడంతో నిమ్మ రైతులు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాయలు లేక వెలవెలబోతున్న తోటలను చూసి, పెట్టుబడి వచ్చే పరిస్థితి కానరాక దిగులు చెందుతున్నారు. జిల్లాలో ప్రధానంగా మెట్ట ప్రాంతమైన దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో సుమారు 2,200 ఎకరాల్లో నిమ్మ సాగు జరుగుతోంది. దీంతో పాటు రాజానగరం, కోరుకొండ తదితర మండలాల్లో కూడా రైతులు నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు.

సగానికి తగ్గిన దిగుబడి

ఏడాదికి నిమ్మ తోటల నుంచి మూడు పంటలు వస్తాయి. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకూ నిమ్మకాయలకు మంచి గిరాకీ ఉండి, రైతులు లాభాలు కళ్లజూస్తారు. తోటలు ఆరోగ్యంగా ఉంటే ఏడాదికి ఎకరాకు సుమారు 100 బస్తాల నిమ్మకాయల దిగుబడి (80 క్వింటాళ్లు – 8 టన్నులు) వస్తుంది. వేసవి పంట ఎక్కువ దిగుబడినిస్తుంది. కానీ, ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడం, పూత దశలో వర్షాలు కురవడం, భూసారం తగ్గడం వంటి కారణాలతో నిమ్మ పూతలు దెబ్బ తిన్నాయి. కలుపు మందులు ఎక్కువగా వాడటం వల్ల చెట్టు దెబ్బ తింటోంది. ఫలితంగా ఎకరాకు నాలుగైదు టన్నులు మాత్రమే దిగుబడి వస్తోంది. అంటే ఇంచుమించు సగానికి సగం దిగుబడి తగ్గింది. సాధారణంగా ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో నిమ్మకాయలకు గిరాకీ తక్కువగా ఉంటుంది. ఈ రెండు మాసాలూ ధర కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. దసరా నుంచి మార్కెట్‌ ఊపందుకుంటుంది. ఈ ఏడాది నిమ్మకాయల ధర నిలకడగా ఉంది. అన్‌ సీజన్‌లో కూడా కిలో రూ.35 నుంచి రూ.50 వరకూ పలికింది. కానీ, దసరా సమయంలో పంట దెబ్బ తిని, తోటల్లో కాయలు లేకపోవడంతో అంతంత మాత్రంగానే ఆదాయం వచ్చి, నష్టపోయామని రైతులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ అధికారుల పర్యవేక్షణ కరువైందని, కనీసం తోటలను పరిశీలించిన దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు. భూసారం తగ్గడం, ఎరువుల వినియోగం పెరగడంతో ప్రతి ఏటా దిగుబడులు పడిపోతున్నాయని చెబుతున్నారు.

కౌలు రైతుకు మరింత నష్టం

కౌలు రైతుల మరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నిమ్మ తోటలు సాగు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. ఒక్కొక్కరు రెండు నుంచి ఐదెకరాల వరకూ కౌలుకు తీసుకుని, తోటలు పెంచుతున్నారు. కౌలు, పెట్టుబడి ఖర్చులు పోనూ నాలుగు డబ్బులు మిగులుతాయనుకుంటే, ప్రస్తుతం చేతి డబ్బులు పడుతున్నాయని వారు వాపోతున్నారు. ఎకరాకు సుమారు రూ.3 లక్షల వరకూ నష్టం వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సొంత భూములున్న రైతులకు ఎకరాకు సుమారు రూ.1.30 లక్షల వరకూ నష్టం వస్తోంది. మొత్తం మీద ఈ ఏడాది తమకు అన్ని విధాలా కోలుకోలేని దెబ్బ తగిలిందని పలువురు నిమ్మ రైతులు ఆవేదన చెందుతున్నారు.

యాదవోలు టు కోల్‌కతా

రాష్ట్రంలో గూడూరు, ఏలూరు తర్వాత దేవరపల్లి మండలంలోని యాదవోలు నిమ్మ మార్కెట్‌కు ఎంతో గుర్తింపు ఉంది. చుట్టుపక్కల 10 మండలాల నుంచి రైతులు యాదవోలు మార్కెట్‌కు నిమ్మకాయలు తీసుకు వచ్చి అమ్ముకుంటారు. ఇక్కడ రైతులే వ్యాపారులుగా మారి.. మార్కెట్లో కాయలు కొనుగోలు చేసి కోల్‌కతా, ఒడిశా, విశాఖపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. దళారీ వ్యవస్థకు చెక్‌ పెట్టి, రైతులే కమిటీగా ఏర్పడి కాయలు కొనుగోలు చేస్తారు. రైతుల నుంచి ఎటువంటి కమీషన్‌ తీసుకోకుండా గిట్టుబాటు ధరకు కాయలు కొనుగోలు చేస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ మార్కెట్‌ పని చేస్తుంది. ఒక్క యాదవోలు గ్రామంలోనే దాదాపు 200 మంది రైతులు సుమారు వెయ్యి ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రోజుకు 35 నుంచి 40 టన్నుల నిమ్మకాయలు మార్కెట్‌కు వస్తున్నాయని వ్యాపారులు తెలిపారు. కిలో నిమ్మకాయల ధర రూ.60 నుంచి 80 పలుకుతోంది.

పూతలకు అనుకూలించని వాతావరణం

సగానికి పడిపోయిన దిగుబడి

అయినా గిట్టుబాటు కాని ధర

గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకూ మార్కెట్లో ధరలు ఈవిధంగా ఉన్నాయి.

నెల కిలో ధర (రూ.)

డిసెంబరు 25.00 - 30.00

జనవరి 30.00 - 35.00

ఫిబ్రవరి 30.00 - 40.00

మార్చి 60.00 - 80.00

ఏప్రిల్‌ 60.00 - 80.00

నిమ్మ రైతు కంట చెమ్మ1
1/6

నిమ్మ రైతు కంట చెమ్మ

నిమ్మ రైతు కంట చెమ్మ2
2/6

నిమ్మ రైతు కంట చెమ్మ

నిమ్మ రైతు కంట చెమ్మ3
3/6

నిమ్మ రైతు కంట చెమ్మ

నిమ్మ రైతు కంట చెమ్మ4
4/6

నిమ్మ రైతు కంట చెమ్మ

నిమ్మ రైతు కంట చెమ్మ5
5/6

నిమ్మ రైతు కంట చెమ్మ

నిమ్మ రైతు కంట చెమ్మ6
6/6

నిమ్మ రైతు కంట చెమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement