పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన

May 2 2025 12:18 AM | Updated on May 2 2025 12:18 AM

పారిశ

పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన

రాయవరం/బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమమవుతుంది. ఇదే ఉద్దేశంతో సాంకేతిక విద్యాశాఖ, పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌)లు ఏర్పాటయ్యాయి. ఐటీఐ కోర్సు పూర్తి కాగానే విద్యార్థులు అప్రెంటిస్‌ చేస్తున్నారు. ప్రతిభతో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడుల్లో అడ్మిషన్లకు ఈ నెల 24 తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో ఐటీఐలు, వాటిలో ఉన్న సీట్లు, ట్రేడ్స్‌ తదితర విషయాలతో ‘సాక్షి’ కథనం.

అధిక శాతం ఇంటర్‌లో..

పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు ఏ కోర్సులో చేరాలా అంటూ ఆలోచన చేస్తారు. అధిక శాతం మంది ఇంటర్మీడియెట్‌లో చేరుతారు. సాంకేతిక విద్య ద్వారా త్వరగా జీవితంలో సెటిల్‌ అవ్వాలనుకునే వారు పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తారు. పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐలు ఒక చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతారు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్‌ ఒకేషనల్‌, పాలిటెక్నిక్‌ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఐటీఐకి ప్రాధాన్యమిస్తున్నారు.

18 ఏళ్లు దాటగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఐటీఐ పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్‌ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్‌, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్‌ సంస్థల్లో ఐటీఐ పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే స్కిల్స్‌ తప్పనిసరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్‌ హబ్స్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికి సైతం ఐటీఐ దోహదపడుతుంది.

ఏడాది, రెండేళ్ల వ్యవధితో రెగ్యులర్‌ కోర్సులు

ఐటీల్లో ఏడాది, రెండేళ్ల కాలపరిమితికి రెగ్యులర్‌ కోర్సులు ఉంటాయి. రెండేళ్ల కాలపరిమితితో ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌, డ్రాఫ్ట్‌స్‌మెన్‌ సివిల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ మెకానికల్‌ వంటి కోర్సులు ఉంటాయి. ఏడాది కాలపరిమితితో డీజిల్‌ మెకానిక్‌, వెల్డర్‌, కటింగ్‌ అండ్‌ సూయింగ్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ కోర్సులు ఉంటాయి. ఐటీఐల్లో చేరగోరే విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న కోర్సులు ఏ ఏ ఐటీఐల్లో ఉన్నాయో వెళ్లి పరిశీలించుకోవాలి. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హత సాధిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతుల ప్రవేశానికి షెడ్యూల్‌ విడుదల చేస్తారు.

రెండేళ్ల కాల పరిమితి కోర్సులు

ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్‌స్‌ మెన్‌ సివిల్‌, ఆర్‌అండ్సె టెక్నాలజీ, మెకానికల్‌ మోటార్‌ వెహికల్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఇనుస్ట్రుమెంట్‌ మెకానిక్‌, టర్నర్‌

ఏడాది కాల పరిమితి కోర్సులు

మెకానిక్‌ డీజిల్‌, సీవోపీఏ, వెల్డర్‌, సూయింగ్‌ టెక్నాలజీ, పీపీవో

డ్రోన్‌ టెక్నాలజీపై స్వల్పకాలిక కోర్సు

గతేడాది కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో డ్రోన్‌ టెక్నాలజీపై ఆరు నెలల వ్యవధి గల కోర్సును ప్రవేశ పెట్టారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్న ఈ కోర్సును ప్రారంభించారు. వ్యవసాయం, సర్వే, షూటింగ్స్‌ డ్రోన్‌ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఐటీఐల్లో డ్రోన్‌ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

పాలిటెక్నిక్‌లోనూ చేరవచ్చు..

ఐటీఐలో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్‌లోనూ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐటీఐ పూర్తి చేసినవారికి పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్‌ పూర్తి చేసినవారు బీటెక్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు లేటరల్‌ ఎంట్రీని పొంది. ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగావకాశాలను పొందుతున్నారు.

ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు

నోటిఫికేషన్‌ విడుదల

10వ తరగతి అర్హతతో ప్రవేశాలు

వివిధ ట్రేడుల్లో

అడ్మిషన్లకు ఈ నెల 24 తుది గడువు

పరిస్థితి ఇదీ..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలు లేవు. కాకినాడ జిల్లాలో మాత్రమే రెండు ఉన్నాయి. కోనసీమ జిల్లాలో ప్రైవేటు యాజమాన్యంలో 15 ఐటీఐలు ఉండగా, వీటిలో ఏడాది, రెండేళ్ల కాల పరిమితితో 2,564 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 12 ప్రైవేట్‌ యాజమాన్యంలో 1,704 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలలో 728 సీట్లు ఉన్నాయి. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీ ఐల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు 4,998 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన

ఐటీఐల్లో ప్రవేశాలకు నిర్ణీత గడువులోగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సును పూర్తి చేసిన వారికి మంచి అవకాశాలు ఉంటున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వివరాలను దరఖాస్తుదారుల వెమొబైల్‌ నంబరుకు పంపిస్తాం. పదో తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం అడ్మిషన్స్‌ ఉంటాయి.

–ఎంవీజీ వర్మ, కాకినాడ, కోనసీమ

జిల్లాల ప్రభుత్వ, ప్రైవేట్‌

ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్‌, కాకినాడ

పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన 1
1/2

పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన

పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన 2
2/2

పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement