
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): నగరంలోని ఆవ పరిసర ప్రాంతాల్లో ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి కబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపించారు. ‘ఇంటి స్థలం కోసం పేదల గోడు’ పేరిట సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన స్థానిక 16వ డివిజన్ ఆవ ప్రాంతం నుంచి సుమారు 4 వేల మందితో ప్రదర్శన గురువారం నిర్వహించారు. ఎస్టీపీ వద్ద మేకల కబేళాను ఆనుకుని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం 16 ఎకరాల స్థలంలో ఎరజ్రెండా పాతి, కొబ్బరికాయ కొట్టి, దీనిని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇంటి స్థలాల హామీని మంగళగిరి మినహా ఇప్పటి వరకూ ఎక్కడా నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం 8 నెలలుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేదల ఇళ్ల స్థలాలుగా పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని రామకృష్ణ అన్నారు. ఇళ్ల స్థలాల సమస్యను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ, ఆవకు ఆనుకుని ఉన్న 16 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని, సుదూర ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే వారు ఇబ్బందులు పడతారని అన్నారు. ఇళ్ల స్థలాలపై తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. తాము రాస్తున్న ప్రతి దరఖాస్తుదారుకు ఇక్కడే ఇంటి స్థలం మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి త్వరలో ఇక్కడ పాకలు వేస్తామని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ కోనసీమ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ భూమి కబ్జాలను నిరోధించాలి
ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
రామకృష్ణ డిమాండ్
ఫ నగరంలో భూ పరిరక్షణ పోరాటం