
మంత్రికి ప్రొటోకాల్తో పనిలేదా?
వైఎస్సార్ సీపీ రామచంద్రపురం నియోజకవర్గ అధ్యక్షురాలు సతీష్కుమారి
రామచంద్రపురం రూరల్: రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్కు ప్రొటోకాల్తో పని లేదా.. అని వైఎస్సార్ సీపీ రామచంద్రపురం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు, వెంకటాయపాలెం సర్పంచ్ యల్లమిల్లి సతీష్కుమారి ప్రశ్నించారు. వెంకటాయపాలెంలో ఆదివారం జరిగిన రేషన్ డిపోల ప్రారంభోత్సవాల నేపథ్యంలో జరిగిన ఘటనలను ఆమె ఆదివారం విలేకరులకు వివరించారు. ఏదో కొత్త వ్యవస్థను తమ ప్రభుత్వంలో నూతనంగా ప్రారంభిస్తున్నట్లు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం హడావుడి చేసిందన్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో రెండు రేషన్ షాపులు ఉండగా 51వ రేషన్ షాపును తాను, గ్రామంలోని జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీటీసీ సభ్యురాలు కణితి వెంకటేశ్వరి, ఇతర గ్రామ పెద్దలతో కలసి ఉదయం 8.30 గంటలకు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ తరువాత 52వ షాపు వద్దకు వెళ్లగా ఎంపీటీసీ సభ్యురాలు స్థానిక కూటమి నాయకులతో కలసి రిబ్బన్ కత్తిరించి అప్పటికే ప్రారంభించడంతో.. మీరు చేసింది సరైన విధానం కాదని డీలర్తో చెప్పి అక్కడి నుంచి వచ్చేసి తహసీల్దార్కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం ఈ రెండు షాపులూ ప్రారంభించేసినా మంత్రి సుభాష్ను కూటమి నాయకులు మధ్యాహ్నం పిలిపించి మళ్లీ వాటికి రిబ్బన్ కత్తిరింపజేయడం గ్రామంలో చర్చనీయాంశం అయ్యిందన్నారు. కూటమి నాయకులు మంత్రిని అవమానించినట్లు భావించాలో, మంత్రి వచ్చిన తరువాత పిలవకపోవడం సర్పంచ్గా నన్ను అవమానించినట్లు భావించాలో అర్థం కావడంలేదన్నారు. ఏది ఏమైనా మంత్రి సుభాష్ ప్రొటోకాల్కి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లం అయ్యిందని ఆమె మండిపడ్డారు.

మంత్రికి ప్రొటోకాల్తో పనిలేదా?