
భక్తులతో పోటెత్తిన రత్నగిరి
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రత్నగిరిపై శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అదే ముహూర్తాలలో రాష్ట్రంలోని పలుచోట్ల కూడా వివాహాలు జరగడంతో నవదంపతులు వారి బంధుమిత్రులు ఆదివారం సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఆదివారం స్వామివారిని 30 వేల మంది దర్శించగా, వ్రతాలు రెండువేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగ చేశారు.
ఘనంగా రథసేవ
ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథం మీద ప్రతిష్ఠించారు. స్వామి, అమ్మవార్లకు పూజలు చేసిననంతరం అర్చకస్వాములు సుధీర్, గణేష్ ప్రాకారసేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.